KCR Plan :   కేసీఆర్  ఏం చేసినా ఓ లెక్కుంటుంది. ఆయనకు లక్కు కూడా ఉంటుంది అంటుంటారు అందరూ.. ఆయనకు లెక్కే కాదు.. లెక్కలేని తనం కూడా ఎక్కువే అంటారు కొందరు. ఎవరేమనుకున్నా.. కేసీఆర్ మాత్రం ఆయన అనుకున్నదే చేస్తారు. మరిప్పుడేం చేశారంటే..  ఎన్నికలకు మూడునెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. అంతే కాదు అందరికీ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈసారి ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. 


సిట్టింగ్‌లకే టిక్కెట్లు


యుద్ధంలో మొదటి అడుగుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ అంటుంటారు దాన్ని. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో మొదటి అడుగు వేసేశారు కేసీఆర్. 2018 ఎన్నికల స్ట్రాటజీనే యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేస్తున్నారు.  అప్పుడు మొదటి విడత 105 స్థానాలకు టికెట్లు ఇస్తే.. ఈ సారి ఏకంగా 115 సీట్లు అనౌన్స్ చేశారు. కేసీఆర్ ముందు చెప్పినట్లుగా దాదాపుగా సిట్టింగులకే సీట్లు వచ్చాయి. 7 స్థానాల్లో మాత్రమే సిట్టింగులకు సీట్లు దక్కలేదు. ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లలో ఒకరికి మినహా అందరికీ సీట్లు దక్కాయి. 


రెండు చోట్ల ఎందుకు..?


ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కిందటి ఎన్నికల్లో  కూడా ఆయన ఇలాగే చేశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనూ అభ్యుర్థులను ముందే ప్రకటిస్తామని చెప్పారు.  దీని కంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం మాత్రం కేసీఆర్ ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు అన్నదే. ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలుపొందిన సిద్దిపేట్ సీటును వదిలి.. గడచిన రెండుసార్లుగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి లో పోటీ చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ ఆలోచనలపై ప్రతిపక్షాలకు ముందే సమాచారం అందినట్లుంది. అందుకే రఘునందనరావు లాంటి బీజేపీ నేతలు కేసీఆర్‌కు ధైర్యం ఉంటే గజ్వేల్ లో మళ్లీ పోటీ చేయాలని సవాలు విసిరారు. తెలంగాణలో అత్యంత శక్తివంతమైన నేతగా.. తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా పేరున్న కేసీఆర్  అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఉంటుందా.. ? కానీ బీజేపీ సవాళ్లు... దానిని బలపరుస్తూ కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 


నిజామాబాద్‌ను స్వీప్ చేయాలన్న లక్ష్యమా ? 


దీనిపై కేసీఆర్ ఆన్సర్ ఇచ్చారు. కనీసం 105 మందిని గెలిపించే ఉద్దేశ్యంతోనే ఇంకో చోట పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీనిపై చాలా కాలంగా వ్యూహం నడుస్తున్నట్లు ఉంది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న కేసీఆర్ ఆలోచనలకు అనుగునంగానే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ తన స్థానంలో కేసీఆర్‌ను పోటీ చేయమని అడుగుతున్నారు . 
కామారెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ తరపున షబ్బీర్ అలీ వంటి బలమైన అభ్యర్థే ఉన్నారు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ దెబ్బతింది. స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి పాలయ్యారు.  ప్రస్తుతం అక్కడ క్యాడర్ ను యాక్టివేట్ చేసి.. తన కుమార్తెను మళ్లీ నిజామాబాద్ బరిలోకి దింపి… అక్కడ గెలిపించిన గౌరవాన్ని పొందాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా అర్థం అవుతోంది. అందుకే ఈ దఫా లిస్టులో కవిత పేరు కనిపించలేదు. అంటే ఆమెను పార్లమెంట్‌కే పంపించే యోచనలో ఉన్నట్లుగా అనుకోవచ్చు. 
కానీ కేసీఆర్ లాంటి నేత... రెండు చోట్ల బరిలోకి దిగడం.. అది కూడా ధైర్యముంటే గజ్వేల్ లో గెలవాలని బీజేపీ నేతలు సవాలు చేసిన తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం.. ఎలాంటి ఫలితాన్నిస్తుందనే చూడాలి. యుద్ధంలో.. తాము గెలుస్తున్నామన్న నమ్మకాన్ని ఎదుటి వారిలో క్రియేట్ చేయడం.. యుద్దతంత్రంగా పేర్కొంటారు. గజ్వేల్ లో మాత్రమే కాదు.. ఇంకో చోట కూడా గెలిచి చూపిస్తామని కేసీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారా అని కూడా చూసుకోవచ్చు. కానీ ఓటమి భయంతోనే కేసీఆర్ రెండో చోట పోటీకి వెళ్లారని రేపటి నుంచి కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తాయి. గజ్వేల్‌ను ఆనుకుని ఉన్న దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలిచింది. సానుభూతి ఉన్నా.. కేసీఆర్ పక్క నియోజకవర్గం అయినా కూడా అక్కడ బీఆర్‌ఎస్‌కు గెలుపు సాధ్యపడలేదు. దీనిని బట్టే గజ్వేల్ ప్రాంతంలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని బీజేపీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. వాళ్ల ప్రచారానికి ఊతం ఇచ్చేలా ఆయన ఇప్పుడు ఇంకోచోట నుచి పోటీకి దిగారు. ఇది ఓటమి భయమా.. ఓటమిని చేధించే వ్యూహమా అన్నది తేలాల్సి ఉందిప్పుడు...


వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకూ మళ్లీ ఎందుకు చాన్స్ ?


ఇక కేసీఆర్ పోటీ సంగతి పక్కన పెడితే.. దాదాపుగా సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వడం సాహసమనే చెప్పాలి. చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే రిపోర్టులు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన 12 మందిలో 11మందికి.. టీడీపీ నుంచి వచ్చిన ఇద్దరికీ మళ్లీ టికెట్లు దక్కాయి. దీంతో అక్కడ టికెట్లపై ఆశలు పెట్టుకున్న స్థానిక నేతలు ఏం చేస్తారన్నది చూడాలి. తెలంగాణలో సీనియర్ నేత.. తెలుగుదేశం పార్టీలో ముఖ్యుడిగా ఉన్న ఒకప్పటి తన స్నేహితుడు తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు. మరో ముఖ్యమైన నేత పట్నం మహేందర్ రెడ్డికీ టికెట్ దొరకలేదు. వీళ్దిద్దరూ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వామపక్షాల ప్రభావం ఉంటుంది. మొన్నటి మునుగోడు ఎన్నికల్లో కమ్యునిస్టులతో చెలిమి చేసిన కేసీఆర్ ఈసారి వాళ్లకి చెయ్యిచ్చారు. లెఫ్ట్ తో పొత్తు ఉంటుందని అనుకున్నా.. అది జరగేది కాదని ఇవాళ తేలిపోయింది. అయితే అన్ని స్థానాలకూ కాండిడేట్లను ప్రకిటించినా ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని కేసీఆర్ క్లియర్ గా ముందే ప్రకటించేశారు. సో గ్రౌండ్ క్లియర్ చేసి కేసీఆర్ పోరు సిద్ధమైపోయారు. మందుగానే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకునేశారు. మరి కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా.. ఇది వర్కవుట్ అయితే సౌతిండియాలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని నిలుపుకుని మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు.