Bandi Sanjay Criticises YS Jagan: అవినీతి, అప్పులు, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. 


తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై బండి....
మందుబాబులను సైతం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న రాష్ట్రం అంధ్రప్రదేశ్ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. జగన్  సర్కార్ పాలన ఈ తరహాలో ఉందని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మద్య నిషేదం ఎందుకు అమలు చేయలేదని జగన్ ను ఆయన ప్రశ్నించారు. మద్యం పై జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మద్య పాన నిషేధంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు హర్షించలేని స్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయిందని వ్యాఖ్యానించారు.


అందులో తెలుగు రాష్ట్రాలు పోటీ...
అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని బండి సంజయ్ అన్నారు.  దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్  మాదిరిగా దేశంలోనూ ఆనాడు భారతీయ జనతా పార్టిని హేళన చేశారని, ఇప్పుడు ఏమైందని ఆయన ప్రశ్నించారు. హేళన చేసిన పార్టీలే నామరూపాల్లేకుండా పోయాయని అన్నారు. 


కేంద్రమే దిక్కు...
ఆంధ్రప్రదేశ్ లో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే, కేంద్ర ప్రభుత్వం కారణమని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయని ధ్వజమెత్తారు.  డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారని, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.


దొంగ ఓట్లపై విమర్శలు...
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే భావన ప్రజల్లో నెలకొందన్నారు బండి సంజయ్. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకు పైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైందని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందన్నారు. అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. బీజేపీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


టీటీడీ ఛైర్మన్ కు పుష్ప సినిమా చూపించండి..
ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన స్రుష్టిస్తూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా అని నిలదీశారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్ట గతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కొత్తగా నియమితులైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కుమార్తె పెళ్లి క్రైసవ ఆచార పద్ధతిలో చేసిన మాట నిజంకాదా అని ప్రశ్నించారు. తాను నాస్తికుడని ఛైర్మన్ గతంలో చెప్పలేదా అని నిలదీశారు. సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెలియదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నారని, ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమోనని ఎద్దేవా చేశారు. 


నరేంద్ర మోడీ నాయకత్వం పై నమ్మకంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారని, ఆయన ప్రజాభిమానం ఉన్న నేతగా అభివర్ణించారు. ప్రజా సమస్యల పై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణమని బండి అన్నారు.