No BRS In Karnataka :   ఫస్ట్ టార్గెట్ అని ప్రకటించిన కర్ణాటకలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పోటీ పెట్టలేకపోయారు. కనీసం తమ మిత్రపక్షం అని చెప్పుకుంటున్న జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్తారో లేదో స్పష్టత లేదు. కేసీఆర్ కర్ణాటక విషయంలో ఎందుకు పూర్తిగా నిరాసక్తంగా ఉన్నారనేది బీఆర్ఎస్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే కర్ణాటకలో బీఆర్ఎస్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో ఉన్న కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపి ఉండేవారు. బెంగళూరులోనూ బీఆర్ఎస్ ప్రభావం ఉండేది. కానీ ఎందుకు కేసీఆర్ సైలెంట్ అయ్యారు. 


కుమారస్వామితో అంత సాన్నిహిత్యం ఒక్క సారిగా ఎందుకు తగ్గిపోయింది ?  


బీఆర్ఎస్‌తో కలిసి పని చేయడానికి జేడీఎస్ సిద్ధంగా ఉంది.  ఆ పార్టీ నేత కుమారస్వామి కేసీఆర్ ఎప్పుడు పిలిచినా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చేవారు.  కలిసి పోటీ చేయడానికి కుమారస్వామి అంగీకారం తెలిపారు. తర్వాత ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభలో ‘రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్ని కల్లో పోటీ చేస్తం. జేడీఎస్ కు​సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటం. మన రాష్ట్ర సరిహద్దు లో ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీని గెలిపించి కు మారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. బీఆర్ఎస్​జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే మొదలైతది అని వ్యాఖ్యానించారు. అయితే ఆ సభకు కుమారస్వామి రాలేదు. అప్పుడే కాదు ఆ తర్వాతా రాలేదు. కేసీఆర్ కూడా వెళ్లలేదు. 


బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన లేకుండానే కర్ణాటకలో ఎన్నికలు 


మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. పార్టీ విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. మూడు బహిరంగసభలు పెట్టారు. కానీ కర్ణాటక ఎన్నికలపై మాత్రం ఇంత వరకూ ఎలాంటి ఆలోచనలు చేయలేదు.  కేసీఆర్ అసలు బయటకు రావడంలేదు. జేడీఎస్ కూడా మద్దతు కోసం ప్రయత్నించడం లేదు. ఫస్ట్ టార్గెట్ అని ప్రకటించుకున్న కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు లైట్ తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర అసలు ఏమీ ఉండదని స్పష్టమయింది.  జేడీఎస్ సపోర్టుగా కర్ణాటకలో అడుగుపెడదామనుకున్న బీఆర్ఎస్ కూడా చొరవ చూపడం లేదు. అయితే కుమారస్వామి మాత్రం కేసీఆర్ పై వ్యతిరేక ప్రకటనలు చేయడం లేదు. ఆయన మా మార్గదర్శి అని చెబుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా జేడీఎస్ రాజకీయం చేస్తోంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో మొత్తం 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పోటీ చేస్తే గెలవకపోయినా మంచి ఓట్లు సాధించే అవకాశం ఉంది. 


ప్రకాష్ రాజ్ ను దూరం పెట్టారా ?


రాజకీయాలపై ప్రకాష్ రాజ్‌కు ఎంతో ఆసక్తి  .  కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చాలనుకున్నప్పుడు ప్రతి సమావేశంలోనూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించేవారు. ఓ సారి ప్రశాంత్ కిషోర్ తోనూ సమావేశం అయ్యారు. ప్రకాష్ రాజ్ కన్నడిగుడు కావడం అక్కడ ఆయనకు రాజకీయంగానూ కొంత ఇమేజ్ ఉండటంతో బీఆర్ఎస్ తరపున ప్రకాష్ రాజ్ అక్కడ పార్టీని లీడ్ చేస్తారేమో అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రకాష్ రాజ్ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కర్ణాటక ఎన్నికల్లో  ఏ పార్టీకీ పని చేయడం లేదు కానీ బీజేపీ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఆయనను బీఆర్ఎస్‌ చీఫ్ గా చేసినా .. కర్ణాటకలో పార్టీ ఉనికి గట్టిగా నిలబడేదన్న అభిప్రాయం ఉంది. కానీ కేసీఆర్ మిస్టరీ పాలిటిక్స్‌లో భాగంగా సైలెంట్ పోయారు.