వడ్లను కొంటారా ? లేదా ? తేల్చుకుంటామని యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ చివరికి రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొంటుందని ప్రకటించారు. చివరి గింజ వరకూ కొంటామన్నారు.  మొదటి నుంచి ఆయన కేంద్రం పై ఆరోపణలు చేశారు. కేంద్రం కొనడం లేదన్నారు. కానీ కేంద్రం మొదటి నుంచి ఒకే మాట చెబుతోంది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని దేశమంతా ఒకే ధాన్యం సేకరణ ఉందని చెబుతూ వస్తోంది. కేంద్రం వడ్ల కొనే ప్రసక్తే లేదని తేల్చేయడంతో కేసీఆర్ తామే కొంటామని కేబినెట్ భేటీ పెట్టి ప్రకటించేశారు . దీంతో బీజేపీపై ప్రకటించిన వరి యుద్ధం ముగిసినట్లయింది. మరి ఈ యుద్ధంలో కేసీఆరే విజయం సాధించారా ? బీజేపీని  రైతు వ్యతిరేకిగా నిలబెట్టగలిగారా ? 


కేంద్రం మెడలు వంచకుండానే ముగిసిన వరి యుద్దం ! 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం కేంద్రం, బీజేపీపై నిర్వహించిన వరి పోరు ముగించారు. ఈ  పోరులో బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  కేంద్రం తెలంగాణ రైతులను గాలికి వదిలేసిందని మండి పడ్డారు.  ఢిల్లీలో కూడా ధర్నా చేశారు.  బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్నారు. అయితే  కేంద్రం వడ్లను కొంటామని కానీ మరో సానుకూల ప్రకటన కానీ చేయలేదు.  అయినా కేసీఆర్ వడ్లను తామే కొంటామని ప్రకటించారు.  కేంద్రంపై మాత్రం విమర్శలు చేస్తున్నారు. 


బాయిల్డ్ రైస్ ఇవ్వబోమన్న లేఖను విడుదల చేసిన బీజేపీ !


ధాన్యం సేకరణ విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఓ ఒప్పందం చేసుకుంది.  ఆ ఒప్పందం ప్రకారం తెలంగాణ సర్కార్ కూడా బియ్యమే ఇస్తామని చెప్పింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చింది. అయినా వడ్లు కొనాలని కేసీఆర్ ఉద్యమం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావించింది.  ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే తాము ధాన్యం కొంటామని స్పష్టం చేసింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో పాటు అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖను బయట పెట్టారు. 


కేసీఆర్ మాట విని వరి పంట వేయని రైతులకు నష్టమేనా ? 


వరి వేయవద్దని ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండదని గత ఏడాది కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. అధికారులూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతైనా ప్రభుత్వం చెబుతోంది కదా అని .. వేల మంది రైతులు వరి పంటను పెట్టలేదు. చాలా మంది ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయలేపోయారు. ఫలితంగా నీటి సౌకర్యం ఉన్నా  వేల ఎకరాలు బీళ్లుగా ఉండిపోయాయి.  వారంతా పంటలు వేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రభుత్వం మాట వినకుండా వరి పంట వేసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోంది.. కానీ ప్రభుత్వం మాట విని ఏ పంటా వేయని వారి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. వారందరికీ ఇప్పుడు కేసీఆర్ సర్ది చెప్పాల్సి ఉంది. 


రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచగలిగారా ? 
  
రైతులను పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం చేయడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు.  తిప్పి కొట్టడానికి కూడా బీజేపీ అంతే తీవ్రంగా ప్రయత్నించింది. ఎవరు ఎంత మేర సక్సెస్ అయ్యారన్నదానిపై రాజకీయవర్గాలు ఇప్పటికీ అంచనాకు రాలేకపోతున్నాయి కానీ మొత్తంగా అయితే కేసీఆర్ వెనక్కి తగ్గారన్న  భావిస్తున్నారు.