Telangana Rajyasabha Seats :  తెలంగాణ లో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది.తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.  21 తో టిఆర్ఎస్ పార్టీకి చెందిన‌ కెప్టెన్ లక్ష్మీకాంతరావు,  ధర్మపురి శ్రీనివాస్ ఇద్దరి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. వీరిద్దరు స్థానంలో లో మరో ఇద్దరు సభ్యులు ఎన్ని కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మే 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 31 వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 1 న నామినేషన్ల పరిశీలన, జూన్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. మరోవైపు ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బండ ప్రకాష్ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగనుంది. 


మూడు స్థానాలూ టీఆర్ఎస్ ఖాతాలోకే ! 


రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టిఆర్ఎస్ పార్టీలో ఆశావాహులు అంతా తెర మీదికి వస్తున్నారు. అసెంబ్లీ లో పూర్తి మెజార్టీతోపాటు, అత్య‌ధిక ఎమ్మెల్యేలు ఉండ‌టంతో మూడు స్థానాలు కూడా టిఆర్ఎస్ కైవసం చేసుకోనుంది.   టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే రాజ్యసభకు ఎవర్ని పంపించాలి అనేది దానిపై కొంత కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రిటైర్ అవుతున్న వారిలో లో ఒక బీసీ సామాజిక వర్గం మరొకరు ఓసీ సామాజిక వర్గం. అయితే ఇప్పుడు భర్తీ చేసే మూడు స్థానాలకు గాను సామాజిక కోణంలో చూస్తే ఒక ఎస్సీ ,  రెండు ఓసీలకు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే బీసీ సామాజిక వర్గానికి చెందిన బడుగుల లింగయ్య యాదవ్ రాజ్యసభ కు పంపించడంతో  ఇప్పుడు బీసీలకు అవకాశం లేనట్లే అని పార్టీలో అనుకుంటున్నారు. 


ఆశావహులు పదుల సంఖ్యలోనే ! 


టీఆర్ఎస్‌లో రాజ్యసభ స్థానాలకు రేస్ చాలా ఎక్కువగానే ఉంది.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  దామోదరరావు, మోత్కుపల్లి నరసింహులు, గుడాల భాస్కర్,  బాలమల్లు, వేణుగోపాల చారి, మందా జగన్నాథం, సినీ నటుడు ప్రకాష్ రాజ్, సీఎల్ రాజం, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు బలంగా ఉన్నది. ఖమ్మం జిల్లాలో గతంలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎంపీ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి అత్యధిక స్థానాలు పొందాలంటే  బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటికి చాన్స్ ఇవ్వాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


ప్రకాష్ రాజ్‌కు చాన్సిస్తారా? 


ఇక ఎస్సీ సామాజికవర్గం నుంచి చూస్తే మోత్కుపల్లి నరసింహులు, బాలమల్లు, మందా జగన్నాథం ఉన్నారు. ఇక ఓసి సామాజికవర్గం నుంచి నమస్తే తెలంగాణ పేపర్ ఎండి దామోదరరావు మాజీ ఎండీ సీఎల్ రాజాం, వేణుగోపాల చారి ఉన్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సిద్దిపేట నేత గుడాల భాస్కర్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఎస్టి సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే సీతారాం నాయక్, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే బూర నర్సయ్య గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన మిత్రుడు, ఇటీవల కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో తన వెంటే ఉంటున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా వినిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లో తనకు అండగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ప్రకాస్ రాజ్ ఒక అసెట్‌  గా మారుతారని అనుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ఱంలోనూ, కేంద్రంలోనూ బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలంటే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి అవసరం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ రాజకీాయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించాలంటే ప్రకాష్ రాజ్ లాంటి వారి సహాకారం ఉంటే బావుటుందని కేసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


జాతీయ అవసరాల కోణంలోనే !


అయితే  కేసిఆర్ ఆర్ ఎప్పుడు ఎవరికి ఏ పదవి కట్టబెడతారు ఎవ్వరు ఊహించలేరు. నామినేషన్ల చివరి రోజూ వరకు కసరత్తు కొనసాగే అవకాశం లేకపోలేదు. అయితే ఈసారి రాజ్యసభ అ ఆశావహులు మాత్రం తమకంటే తమకు వస్తుందని అని అనుకుంటున్నారు. సామాజిక సమీకరణాలు, ఢిల్లీలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముగ్గురిని ఎంపిక చేసే అవకాశం ఉంది.