Suvendu Adhikari:  పశ్చిమ బెంగాల్‌లోని హాలిసహార్‌లో లాకప్ డెత్‌కు గురైన టీఎంసీ కార్యకర్త బిర్జూ కేయోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్లు, బురద, తిరగబడిన చెప్పులతో దాడి జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందా, లేక స్థానిక ప్రజల ఆగ్రహమా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

Continues below advertisement

దాడి వెనుక ఎవరున్నారు- ప్రజలా? రాజకీయ శక్తులా? 

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దాడులు కేవలం అనుకోకుండా జరిగే  ప్రజాగ్రహం గా మాత్రమే ఉండవని, దీని వెనుక పక్కా వ్యూహాలు ఉంటాయని  భావిస్తున్నారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పందిస్తూ.. ఇది ప్రజల్లో ఉన్న అసంతృప్తి అని, మమత ప్రణాళిక లేకుండా సెక్షన్ 163 అమలులో ఉన్న ప్రాంతానికి వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే, పోలీస్ కస్టడీలో జరిగిన మరణం వెనుక పాలనా యంత్రాంగ లోపాలు స్పష్టంగా ఉన్నప్పటికీ,  చోర్ ,  డాకత్ రాణి అని నినాదాలు చేస్తూ విరుచుకుపడటం వెనుక పక్కాగా బీజేపీ రాజకీయ శక్తుల కుట్ర ఉందనేది టీఎంసీ ఆరోపణ.

Continues below advertisement

పెద్దగా పట్టించుకోని పోలీసులు

టీఎంసీ కార్యకర్త బిర్జూ కేయోట్ పోలీస్ కస్టడీలో మరణించడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.  మాజీ సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి వచ్చినప్పుడు, పోలీసుల సమక్షంలోనే ఆమె కాన్వాయ్‌పై రాళ్లు, బురద విసరడం చూస్తే.. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని తేటతెల్లమవుతోంది. ప్రభుత్వం లేదా పోలీసులు కఠినంగా ఉంటే ఇటువంటి మూక దాడులు జరిగే అవకాశం ఉండదన్నది స్పష్టం. బెంగాల్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా – గతంలో సీపీఐ(ఎం) ,  ఆ తర్వాత టీఎంసీ లేదా ప్రస్తుత బీజేపీ హయాంలో అయినా –  హింసాత్మక రాజకీయం మాత్రం మారలేదు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత లేదా నిరసనల సమయంలో హింసను ఒక రాజకీయ ఆయుధంగా వాడటం అక్కడ పరిపాటిగా మారింది. ఇటువంటి దాడుల వల్ల రాజకీయం మెరుగుపడటానికి బదులుగా, మరింత కక్షసాధింపు చర్యలకు, స్థానిక కేడర్ మధ్య రక్తపాతానికి దారితీస్తుంది.

 మమతా బెనర్జీ  వ్యూహం ఏంటి? 

ఈ దాడి ఘటనను మమతా బెనర్జీ ఒక రాజకీయ ఆయుధంగా మలచుకోవడానికి సిద్ధమవుతున్నారు. తనపై జరిగిన దాడిని 'ప్రజాస్వామ్యంపై దాడి'గా చిత్రీకరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల ద్వారా దెబ్బతిన్న టీఎంసీ శ్రేణుల్లో మళ్లీ పట్టు పెంచడానికి, సానుభూతిని కూడగట్టడానికి ఆమె ప్రయత్నిస్తారు. సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఘటన ద్వారా టీఎంసీపై ప్రజాదరణ తగ్గించవచ్చని భావించినప్పటికీ, ఒక మహిళా నేతపై, మాజీ సీఎంపై ఈ తరహా భౌతిక దాడులు జరగడం సానుభూతికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. బెంగాల్ రాజకీయాల్లో ప్రతి దాడికీ ఒక ప్రతిదాడి ఉండే చరిత్ర ఉన్నందున, సమీప భవిష్యత్తులో టీఎంసీ - బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.