నాడు హైదరాబాదులో జలదృశ్యం.. నేడు ఢిల్లీలో అద్వితీయ దృశ్యం! అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ ప్రారంభోత్సవం, కేవలం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకి గర్వకారణమన్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం.. నేడు ఒక చారిత్రక అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. గోల్డెన్ తెలంగాణ మోడల్ పైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా  చర్చ జరుగుతోందని చెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు కెటిఅర్ పిలుపునిచ్చారు.


జలదృశ్యంలో ఒక్కరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై.. దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులందరికి కేటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, కేవలం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదు  యావత్తూ తెలంగాణ ప్రజలకి గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సారథ్యంలో.. పార్టీ కార్యశ్రేణుల పట్టుదల వలనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకైన బీఆర్ఎస్ జెండా ఇవాళ సమున్నతంగా ఢిల్లీలో రెపరెపలాడిందని కెటిఅర్  గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడే.. ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతున్న వేళ... బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం.. నేడు ఒక చారిత్రక అవసరమన్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుని... ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా... ఇప్పుడు దశాబ్దాలపాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టిందన్నారు కేటీఆర్.  ఉద్యమపాఠాల నుంచి మొదలుకుని.. యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసిఆర్‌కే దక్కిందని వెల్లడించారు. ఈ మహాప్రస్థానంలో.. బీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమని.. అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని కేటిఆర్ గుర్తుచేశారు.


గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదని దేశప్రజలు గ్రహించిన నేపథ్యంలో గోల్డెన్ తెలంగాణ మోడల్  పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ బలమైన ముద్ర వేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదంతొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇచ్చిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగుతోందన్నారు. నాడు తెలంగాణ సాధన  కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో.. అదే స్ఫూర్తితో దేశం కోసం కదంతొక్కాలని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని ఈ సందర్భంగా బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ పిలుపునిచ్చారు.


దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో BRS జెండాను ఎగురవేసిన తర్వాత వైదిక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట. 5 నిమిషాలకు రిబ్బన్‌ కట్‌ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర కార్యాలయ ఆవరణలో యాగం, స్తోత్ర పారాయణాలతో శుభకరమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే కార్యాలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బారులు తీరారు. బిఆర్ఎస్ భవన్ పరిసరాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.