కుటుంబ సభ్యులతో ములాఖత్ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన అభిప్రాయాలు, ఆలోచనలను రాష్ట్ర ప్రజలకు లేఖ రాయాలని కోరారు. దీంతో.. ఆయన చెప్పిన అంశాలను పొందుపరిచి చంద్రబాబు పేరిట కుటుంబ సభ్యులు లేఖను విడుదల చేశారు. ఈ లేఖ చదివిన టీడీపీ శ్రేణులు, చంద్రబాబు మద్దతుదారులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.


ఏపీ స్కిల్ డెవలప్‌‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు గత నెలన్నరకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం తెలిసిందే. తాను జైల్లో లేనని ప్రజల గుండెల్లో ఉన్నా... తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం చంద్రబాబు నాయుడి లేఖ విడుదల చేశారు. అటు లేఖపై స్పందించిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల చేయలేదని స్పష్టంచేయడంతో దీనిపై వివాదం నెలకొంది.


ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారని చెప్తున్న లేఖపై విచారణ జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. చంద్రబాబు లేఖ వ్యవహారం, జైల్లో భద్రతపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జైలు నుంచి ఎటువంటి లేఖ బయటకు వెళ్లలేదని జైలు అధికారులు చెప్తున్నారని రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు.


విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో చర్యలుంటాయని అన్నారు. జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు భద్రత కోసం జైల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసిన లేఖపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్..


ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు. నారా లోకేష్‌, బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యచరణ భేటీపై బాబుతో లోకేష్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం సోమవారం రాజమండ్రిలో మధ్యాహ్నం 3 గం.లకు జరగనుంది.


ఈ సమావేశానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నారా లోకేశ్, బ్రాహ్మణితో ములాఖత్ సందర్భంగా చంద్రబాబు కోరారని టీడీపీ నేత చినరాజప్ప మీడియాకు తెలిపారు.


తాను జైల్లో లేను ప్రజల గుండెల్లో ఉన్నా… తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రి జైలు నుంచి ఆదివారం చంద్రబాబు నాయుడి లేఖ విడుదల చేశారు. అటు లేఖపై స్పందించిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల చేయలేదని స్పష్టంచేయడంతో దీనిపై వివాదం నెలకొంది. చంద్రబాబు నాయుడి పేరుతో నారా లోకేశ్ ఈ ఫేక్ లేఖను విడుదల చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై విచారణ జరిపిస్తామని ఏపీ డీజీపీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.