తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫ్‌లైన్‌లో కాదు ఆన్‌లైన్‌లోనూ దూకుడుగా ఉంటోంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజ్యసభలో చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసనలు చేపడుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లోనూ ఈ నిరసనలు గట్టిగా వినిపించేలా ఆ పార్టీ చర్యలు తీసుకుంది. బుధవారం ట్విట్టర్‌లో తెలంగాణకు మోదీ శత్రువు అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు ట్రెండయ్యాయి. 






తెలంగాణకు మోడీ శత్రువు అంటూ #ModiEnemyOfTelangana హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని తెలియచేశారు. కేవలం ఒక గంటలోనే 25వేలకు పైగా తెలంగాణ ప్రజలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తమ నిరసనను తెలియజేశారు. దీంతో #ModiEnemyOfTelangana ట్విట్టర్ ట్రెండింగ్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత ఇతర హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మొత్తంగా  #ModiEnemyOfTelangana యాబై వేలకుపైగా ట్వీట్లు చేశారు.


 






ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ "ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ " అనే హాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో  ట్రెండ్ చేసింది. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చూసుకుంది. అప్పుడు బీజేపీ కూడా వెంనటే రంగంలోకి దిగి  "షేమ్ ఆన్ యు కేసీఆర్"  హ్యాష్ ట్యాగ్‌తో ప్రధానికి ఆహ్వానం చెప్పని కేసీఆర్‌ను ప్రశ్నించారు.  టీఆర్ఎస్ ట్రెండ్ చేసిన హ్యాష్ ట్యాగ్ కంటే ఎక్కువే వచ్చాయని బీజేపీ  ప్రకటించుకుంది. 
 
టీఆర్ఎస్ ఇటీవలి కాలంలో ట్విట్టర్ ట్రెండింగ్‌ల మీద ఎక్కువ దృష్టి పెట్టింది.  నెగెటివే కాదు పథకాల విషయంలోనూ ట్రెండింగ్ చేస్తున్నారు. రైతు బంధు పథకం సంబరాలప్పుడు కూడా  పార్టీ కార్యకర్తలందరూ ట్వీట్లు చేసి.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలబెట్టారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆన్‌లైన్ ప్రచారాలూ కూడా అత్యంత కీలకమయ్యాయి. ఈ విషయంలో ఎవరికి వారు బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ట్రెండింగ్‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.