Abhishek Banerjee as successor in Trinamool Congress:  పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సుమారు 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు నిరాకరించడం ద్వారా ఆమె తన సొంత పార్టీలోనే ఒక పెద్ద  ప్రయోగం చేస్తున్నారు. 

Continues below advertisement

అధికార వ్యతిరేకతపై సర్జికల్ స్ట్రైక్

వరుసగా  సార్లు పర్యాయాలు అధికారంలో ఉన్నందున సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను   తుడిచిపెట్టడమే మమత ప్రధాన లక్ష్యం. క్షేత్రస్థాయిలో పనితీరు సరిగ్గా లేని వారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు,  ప్రజలకు దూరమైన నేతలను ఆమె నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. 74 మంది ఎమ్మెల్యేలను తొలగించడం అనేది టీఎంసీ చరిత్రలోనే అత్యంత భారీ మార్పుగా అభివర్ణించవచ్చు. దీని ద్వారా తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. పార్టీలో చోటు లేదు అనే బలమైన సందేశాన్ని ఆమె ఓటర్లలోకి పంపగలిగారు.

Continues below advertisement

అభిషేక్ బెనర్జీ మార్క్.. యువతకు పెద్దపీట

ఈ టిక్కెట్ల కోత వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. పాత తరం నేతలను తగ్గించి, సుమారు 45% సీట్లను 50 ఏళ్ల లోపు ఉన్న యువ నేతలకు కేటాయించడం ద్వారా పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాలని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా దేవంగ్షు భట్టాచార్య వంటి యువ ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, యంగ్ బెంగాల్ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. ఇది పార్టీలో పాత-కొత్త తరాల మధ్య కొంత ఘర్షణకు దారితీసినప్పటికీ, భవిష్యత్తు నాయకత్వం కోసం ఈ మార్పు అనివార్యమని అధిష్టానం నమ్ముతోంది.

వివాదాస్పద నేతలపై వేటు

ఉపాధ్యాయ నియామక కుంభకోణం, రేషన్ కుంభకోణం వంటి కేసుల్లో చిక్కుకున్న వారు , జైలులో ఉన్న మాజీ మంత్రులు  ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. గతంలో సినీ తారలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే టీఎంసీ, ఈసారి స్టార్ పవర్ కంటే గ్రౌండ్ పవర్ మిన్న అని భావించి పలువురు నటులకు  సీట్లు నిరాకరించింది. ఇది పార్టీ ఇమేజ్‌ను ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్గత అసమ్మతి - పొంచి ఉన్న ముప్పు

అయితే, ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం టీఎంసీకి అగ్నిపరీక్ష వంటిదే. టిక్కెట్లు దక్కని 74 మంది నేతల్లో కొందరు ఇప్పటికే అసమ్మతి రాగంతో ఉన్నారు. కొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తామని హెచ్చరిస్తుంటే, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ అసమ్మతి నేతలు గనుక రెబెల్స్ గా మారి ఓట్లను చీలిస్తే, అది గట్టిపోటీ ఉన్న స్థానాల్లో టీఎంసీకి నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా హుగ్లీ, మాల్దా వంటి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని  భావిస్తున్నారు. 

వ్యూహాత్మక స్థానచలనం

మరోవైపు, 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి పాత నియోజకవర్గాల నుండి మార్చి కొత్త చోట పోటీకి దించడం ద్వారా స్థానిక వ్యతిరేకతను అధిగమించాలని మమత ప్లాన్ చేశారు. ముఖ్యంగా మమత స్వయంగా తన పాత కోట భవానీపూర్‌కు తిరిగి రావడం, అక్కడ బీజేపీ నేత సువేందు అధికారితో తలపడటం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మొత్తానికి, ఈ గ్రేట్ రిఫార్మ్  మమతకు నాలుగోసారి అధికారాన్ని కట్టబెడుతుందో లేక సొంత పార్టీలోనే సంక్షోభానికి దారితీస్తుందో మే 4న వచ్చే ఫలితాలే తేల్చాలి.