BJP is sending strong warnings to TVK Vijay:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, విజయ్ రాజకీయ ప్రయాణం ముళ్లబాటగా మారుతోంది. గతేడాది కరూర్‌లో జరిగిన పార్టీ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతి  కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ  విచారిస్తోంది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే విజయ్‌ను ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో  మూడు సార్లు గంటల తరబడి విచారించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామం విజయ్‌ను రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసిందనే వాదన వినిపిస్తోంది.

రాష్ట్ర పరిధి దాటిన వివాదం                           

సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతారు. అప్పుడు అధికార డీఎంకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, దానిని  రాజకీయ కక్ష సాధింపుగా విజయ్ అభివర్ణించే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు విచారణ కేంద్ర సంస్థ అయిన సీబీఐ చేతుల్లో ఉండటంతో విజయ్‌కు ఆ వెసులుబాటు లేకుండా పోయింది. సీబీఐ విచారణ అంటే అది నేరుగా కేంద్రంలోని బీజేపీ నియంత్రణలో ఉంటుందనేది బహిరంగ రహస్యం. దీనివల్ల విజయ్ ఇప్పుడు అటు డీఎంకేను, ఇటు బీజేపీని ఒకేసారి ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. 

బీజేపీ మైండ్ గేమ్                        

విజయ్ తన పార్టీని స్థాపించినప్పటి నుండి  ఒంటరి పోరు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అయితే, సీబీఐ కేసుల ద్వారా బీజేపీ ఆయనపై ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్‌ను ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ ఈ కేసులను అస్త్రంగా వాడుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విజయ్ బీజేపీకి అనుకూలంగా మారకపోతే, ఈ విచారణలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.  కేవలం సీబీఐ కేసులే కాకుండా, పాత ఇన్‌కమ్ టాక్స్  కేసులకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సుమారు రూ. 15 కోట్ల అదనపు ఆదాయంపై పన్నులు, జరిమానాలు చెల్లించాలనే పాత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాజకీయ పార్టీ నడపడానికి భారీగా నిధులు అవసరమైన తరుణంలో, ఇలాంటి ఆర్థిక పరమైన చిక్కులు అభ్యర్థుల ఎంపికపై,  ప్రచార ఖర్చులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇది విజయ్ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తోంది.

 విజయ్ ముందున్న దారులు 

ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, కేసులను ఎదుర్కొంటూ  బాధితుడు  కార్డును వాడి ప్రజల్లో సానుభూతి పొందడం. రెండు, బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని కేసుల నుండి ఉపశమనం పొందడం. అయితే, రెండో దారిని ఎంచుకుంటే తమిళనాడులో ఆయనకున్న   అస్తిత్వం దెబ్బతింటుంది. డీఎంకే ఇప్పటికే విజయ్‌ను బీజేపీ బినామీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య విజయ్ తన రాజకీయ ఉనికిని ఎలా కాపాడుకుంటారో చూడాలి.