YSRCP is looking for an effective strategist: గత ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం నుండి పాఠాలు నేర్చుకున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టారు. వైసీపీకి 2019లో రికార్డు స్థాయి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ సేవలను మళ్లీ వినియోగించుకోవాలని పార్టీ యోచిస్తోంది. ఐ-ప్యాక్ సంస్థ పీకే పర్యవేక్షణలో లేకపోవడం వల్లే గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు రాలేదని, క్యాడర్లో సమన్వయం లోపించిందని వైసీపీ అంతర్గత విశ్లేషణలో తేలింది. అందుకే, మళ్లీ పీకే వైపే జగన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఐ-ప్యాక్ వైఫల్యం.. స్ట్రాటజిస్ట్ కోసం అన్వేషణ
గత ఎన్నికల్లో ఐ-ప్యాక్ పనితీరుపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వాలంటీర్ వ్యవస్థపై అతిగా ఆధారపడటం, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలం కావడం వంటి కారణాలతో ఐ-ప్యాక్ సేవలను జగన్ పక్కన పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు కొత్త స్ట్రాటజిస్టులతో చర్చలు జరిపినా, పీకే స్థాయిలో ప్రభావాన్ని చూపగల వారు ఎవరూ దొరకలేదు. రాజన్న రాజ్యం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీకేకున్న అనుభవం మరెవరికీ లేదని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారు.
బీహార్ పరాజయం - పీకే ఖాళీగా ఉన్నారా?
ప్రశాంత్ కిషోర్ సొంతంగా స్థాపించిన జన్ సూరాజ్ పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాజయంతో పీకే రాజకీయ ప్రయాణం ఒకింత మందగించింది. ప్రస్తుతం ఆయన మళ్లీ పొలిటికల్ కన్సల్టెన్సీ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో జగన్ మోహన్ రెడ్డి పీకేను సంప్రదించడం వ్యూహాత్మకమైన అడుగుగా కనిపిస్తోంది. పీకే కూడా జాతీయ స్థాయిలో తన పట్టు నిరూపించుకోవడానికి వైసీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీతో మళ్లీ పనిచేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆమె పీకేతో వరుస భేటీలు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో కొత్త పార్టీ నిర్మాణానికి, కేడర్ సమీకరణకు పీకే సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ పీకే మళ్లీ వ్యూహకర్తగా రంగంలోకి దిగితే, అటు కవితకు, ఇటు జగన్కు ఏకకాలంలో సేవలు అందిస్తారా? లేక ఏదో ఒకరికే పరిమితమవుతారా? అన్నది వేచి చూడాలి.
వచ్చే ఎన్నికలకు పీకే గేమ్ ప్లాన్
జగన్ ప్రయత్నాలు ఫలిస్తే, 2029 ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ మళ్లీ వైసీపీ రథసారధిగా మారవచ్చు. గతంలో నవరత్నాలు , పాదయాత్ర వంటి సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్లను డిజైన్ చేసిన పీకే, ఇప్పుడు ఎటువంటి కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తారనేది ఆసక్తికరం. సోషల్ మీడియా మేనేజ్మెంట్ నుండి అభ్యర్థుల ఎంపిక వరకు పీకే మార్క్ రాజకీయం మళ్లీ ఏపీలో కనిపిస్తుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత పీకే-జగన్ విషయంలో నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐ-ప్యాక్తో తెగతెంపులు చేసుకున్న వైసీపీకి, పీకే మళ్లీ ప్రాణం పోస్తారా? లేక పాత జ్ఞాపకాలతోనే జగన్ ఒంటరి పోరాటం చేస్తారా? అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
