Regional Parties Survival Strategy: భారత జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ, వాటి అధినేతల వ్యూహాత్మక చతురతపైనే ఆధారపడి ఉంటుంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలై, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఏకంగా 28 మంది లోక్సభ సభ్యుల్లో 20 మంది ఎంపీలు కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో తిరుగుబాటు చేసి ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం సృష్టించింది. ఈ దెబ్బతో మమతా బెనర్జీ సామ్రాజ్యం చిన్నాభిన్నమైపోయింది. దీనికి పూర్తి భిన్నంగా తమిళనాడులో ఓటమి పాలైన ద్రవిడ మున్నేట్ర కజగం మాత్రం అత్యంత సుస్థిరంగా, ధీమాగా ఉంది. ఈ రెండు పార్టీల భిన్నమైన పరిస్థితులకు ఆయా అధినేతలు అనుసరించిన విరుద్ధమైన రాజకీయ పంథాలే కారణం.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న ప్రస్తుత దుస్థితికి ఆమె అనుసరించిన ఆవేశపూరిత, ఘర్షణ వైఖరి కలిగిన రాజకీయాలే ప్రధాన కారణం. దేశంలో బీజేపీ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, కేంద్రంలో తిరుగులేని అధికారంలో ఉన్న శక్తీని కేవలం ఆవేశంతో ఢీకొట్టవచ్చని ఆమె భావించారు. ప్రతిపక్షాల ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ, కేంద్రంతో నిరంతరం యుద్ధ వాతావరణాన్ని కొనసాగించడం వల్ల.. బీజేపీ అగ్రనాయకత్వం బెంగాల్ను పూర్తిస్థాయి పొలిటికల్ టార్గెట్గా మార్చుకుంది. ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా మమత వాస్తవాలను అంగీకరించకుండా మొండి వైఖరి ప్రదర్శించడంతో, పార్టీలోని ఎంపీలు, కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం మమతకు హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ వైపు క్యూ కట్టారు. పరిస్థితుల్ని లౌక్యంతో కాకుండా కేవలం ఈగోతో డీల్ చేయడం వల్లే దీదీ ఈరోజు ఒంటరిగా మిగిలిపోయారు.
ఓడిపోగానే కాంగ్రెస్ను వదిలించుకున్న డీఎంకే
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పక్కా ‘ప్రాగ్మాటిక్ పాలిటిక్స్’ నడిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న తీరును, అదే సమయంలో కేంద్రంలో బీజేపీ దూకుడును ఆయన ముందే పసిగట్టారు. కాంగ్రెస్తో గుడ్డిగా వెళ్లడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడటమే కాకుండా, కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా నీడన డీఎంకే కూడా నలిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించారు. అందుకే, ఇండియా కూటమి వ్యవహారాల్లో నెమ్మదిగా వెనకడుగు వేస్తూ చివరికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్తో ఒక సురక్షితమైన దూరాన్ని మెయింటైన్ చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ భారాన్ని నెత్తిన వేసుకోకపోవడం వల్లే, బీజేపీ గురిపెట్టే ప్రధాన శత్రువుల జాబితా నుండి డీఎంకే తృటిలో తప్పించుకోగలిగింది.
ఎన్డీఏలోకి డీఎంకే అంటూ వ్యూహాత్మక ప్రచారం
ఈ వ్యూహానికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. దిల్లీ రాజకీయ వర్గాల్లో డీఎంకే ఒక సున్నితమైన ప్రచారాన్ని సజీవంగా ఉంచింది. భవిష్యత్తులో లేదా రాబోయే ఎన్నికల సమీకరణాల దృష్ట్యా డీఎంకే ఎన్డీఏ కూటమిలోకి వెళ్లవచ్చనే ఊహాగానాలు, లీకులు పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేశాయి. ఈ వ్యూహాత్మక లీకులు స్టాలిన్కు ఒక పెద్ద రక్షణ కవచంగా మారాయి. ఎన్డీఏ తలుపులు డీఎంకే కోసం తెరిచే ఉంటాయనే వాతావరణం ఉండటం వల్ల, కేంద్రంలోని బీజేపీ సైతం డీఎంకేను రాజకీయంగా పూర్తిగా దెబ్బతీయాలనే తీవ్రమైన ప్రయత్నాలు చేయలేదు. తమ వైపు వచ్చే అవకాశం ఉన్న శక్తీని ఎందుకు కెలుక్కోవడం అనే కోణంలో కేంద్ర పెద్దలు కూడా డీఎంకే జోలికి వెళ్లకుండా వ్యూహాత్మక మౌనం పాటించారు.
రాజకీయాల్లో టైమింగ్, ఫ్లెక్సిబిలిటీ ఎంత ముఖ్యమనే దానికి స్టాలిన్, మమతా బెనర్జీల ప్రస్తుత స్థితులే నిదర్శనం. మమత తన అపరిమిత ఆవేశంతో, బీజేపీతో ఢీ అంటే ఢీ యుద్ధానికి దిగి సొంత పార్టీని, లోక్సభ, రాజ్యసభ సభ్యులను కోల్పోయే నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. కానీ, స్టాలిన్ మాత్రం జాతీయ రాజకీయాల్లో ఏ శక్తీ శాశ్వత శత్రువు కాదు, శాశ్వత మిత్రుడు కాదనే ప్రాథమిక సూత్రాన్ని నమ్మారు. ఆయన నడిపిన చదరంగం డీఎంకేను అత్యంత సురక్షితంగా ఉంచింది. ఈ భిన్నమైన పరిణామాలు దేశంలోని మిగతా ప్రాంతీయ పార్టీలకు ఒక గొప్ప పొలిటికల్ లెసన్గా నిలుస్తున్నాయి.
