Tiruvuru : ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఆయన దూకుడిని తట్టుకోలేక సొంత పార్టీ నేతలే ఆయనపై పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వాళ్ళలో స్థానిక జర్నలిస్టులు సైతం ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్‌ను గత ఎన్నికల్లో ఏరికోరి మరీ కొలికపూడికి ఇచ్చారు చంద్రబాబు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు దూకుడు నైజం అనేక ఇబ్బందులు తెచ్చి పడుతుందని అంటున్నారు పార్టీ ముఖ్యులు.


అమరావతి రైతు ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కొలికపూడి 
ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు జగన్ తెచ్చిన మూడు రాజధానుల బిల్లు వ్యతిరేకించి వెలుగులోకి వచ్చారు. అమరావతి రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అమరావతి జేఏసీ కన్వీనర్‌గా పోరాటాలు చేశారు. చాలా కేసులు, పోలీసుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొని మరీ అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు 2024 ఎన్నికల్లో కీలకమైన తిరువూరు సీటును కొలికపూడి శ్రీనివాసరావుకు కేటాయించారు. మాజీ మంత్రి జవహర్‌ను పక్కన పెట్టి మరీ తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కొలికపూడికే ఇచ్చారు. మొదట్లో తిరువూరులో పెద్దగా ఫాలోయింగ్ ఏర్పడకపోయినా నెమ్మదిగా అక్కడ తన పట్టు బిగించారు కొలికపూడి. దానికి కూటమి హవా కూడా తోడవడంతో ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి స్వామి దాస్‌ను 21874 ఓట్ల తేడాతో ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీనివాసరావు.


పేరు తెచ్చిన దూకుడే ఇబ్బందిగా మారిన వైనం
అమరావతి ఉద్యమ నేతగా పేరు తెచ్చిన దూకుడు స్వభావమే ప్రస్తుతం కొలికపూడికి ఇబ్బంది కలిగిస్తోంది. అక్కడితో ఆగకుండా పార్టీకి కూడా తలనొప్పులు తెస్తుందనేది పార్టీ నేతల అభిప్రాయం. గెలిచిన వెంటనే స్థానిక వైసిపి నాయకుడి కట్టడాన్ని అక్రమం అంటూ కూల్చడానికి వెళ్లిన బృందంతోపాటు స్వయంగా ఎమ్మెల్యే వెళ్లడం విమర్శల పాలైంది. దీనిపై సీఎం చంద్రబాబు కలుగజేసుకుని ఎమ్మెల్యే కొలికపూడిని మందలించినట్టు కథనాలు వచ్చాయి. ఎలా వైసిపి అధికారం కోల్పోయిందో అది తన పార్టీలో ఉండకూడదనేది చంద్రబాబు అభిప్రాయం. అందుకే నేతలందరూ ఎప్పుడు సంయమనంతోనే ఉండాలని ఆయన చెబుతూ వస్తున్నారు. అయితే కొలికపూడి మాత్రం ఇది అర్థం చేసుకోవడం లేదనేది పార్టీలో ఉన్న అభిప్రాయం. అన్నిటిని మించి తిరువూరు నియోజకవర్గంలో వర్గాలు చాలా ఎక్కువ. మాజీ మంత్రి జవహర్‌కి సంబంధించిన వర్గం, మొన్నటి వరకు టిడిపిలో ఉండి వైసీపీలోకి వెళ్లిన స్వామి దాస్ వర్గం ఉంది. స్థానికేతరుడిగా ఉన్న కొలికపూడిని తిరువూరుకు తెచ్చారని వ్యతిరేకించే మరో వర్గం ఇలా తిరువూరులో రాజకీయ వర్గాలు చాలానే ఉన్నాయి. వీళ్ళందర్నీ కలుపుకొని పోవాల్సిన ఎమ్మెల్యే మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారనేది ప్రధాన విమర్శ. 


సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నం అంటూ కథనాలు 
గత వారంలో క్రితం చిట్టెల గ్రామానికి చెందిన సర్పంచ్ తుమ్మలపల్లె శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే దుర్భాషలాడడంతో ఆయన భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె విజయవాడలో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న మీడియా ప్రతినిధులతో కూడా ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారంటూ సీఎంకు కంప్లైంట్ చేశారు సదరు మీడియా ప్రతినిధులు. ఇవిలా ఉండగానే సొంతపార్టీకి సంబంధించిన కొందరు నేతలే తిరువూరు లోని గ్రావెల్, మట్టి అక్రమంగా తవ్వుకు పోతున్నారంటూ "సేవ్ తిరువూరు పేరుతో సోమవారం ఒక భారీ ర్యాలీ చేస్తా అంటూ ప్రకటించారు కొలికపూడి. దీంతో అసలు ఎమ్మెల్యే మాకొద్దు అంటూ స్థానిక టిడిపి నేతలు చంద్రబాబుకు కంప్లైంట్ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్‌కు సైతం కంప్లైంట్ వెళ్ళింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొలకపూడి శ్రీనివాస్‌ని నెమ్మదించమంటూ హై కమాండ్ ఆదేశించడంతో ఆయన తన " సేవ్ తిరువూరు" ర్యాలీ ని విరమించుకున్నారు. చంద్రబాబు తిరువూరు ఇంచార్జ్ బాధ్యతలు వసంత కృష్ణ ప్రసాద్‌కు అప్పగించారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై వసంత కృష్ణ ప్రసాద్ స్పందిస్తూ అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు.


కొలికపూడి పై కుట్ర జరుగుతోందా?
ఈ మొత్తం వివాదాలపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాదన మరోలా ఉంది. తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్ర చేస్తున్నారని స్థానికేతరుడిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. పార్టీలోని కొందరి అడ్డుకునే ప్రయత్నం చేసినందుకే తనపై ఇలా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని త్వరలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పుకొస్తున్నారు. వీటిలో వాస్తవం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.