Nara Bramhani Politics :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఆ పార్టీలో పార్టీని నడిపేది ఎవరు అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. దీనికి కారణం నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేతలతో పాటు సీఐడీ చీఫ్ సంజయ్ కూడా పలుమార్లు  ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ పేరు కూడా పెట్టడంతో అరెస్ట్ ఖాయమని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ తరపున ఎవరు ప్రజల్లోకి వెళ్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి మాటలతో కాకుండా చేతలతో రాజకీయాలు ప్రారంభించేశారు.  చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుండి రాజమండ్రి క్యాంప్ సైట్ లోనే ఉంటున్నారు. ఇద్దరూ దాదాపుగా ప్రతీరోజూ ఏదో ఓ రాజకీయ ప్రకటన చేస్తున్నరు. ఈ ప్రకటనలు అన్నీ  వైరల్ అవుతున్నాయి. 


నారా  బ్రాహ్మణి చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనాలని కోరుకుంటున్న టీడీపీ క్యాడర్ 


రాజమండ్రిలో టీడీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన రోజు నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. సూటిగా , స్పష్టంగా ఎక్కడా తడబాటు లేకుండా ఆమె మీడియాకు ఇచ్చిన సమాధానాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో రాణించే సామర్థ్యం ఉందన... భయపడే తత్వం కూడా కాదని అందరూ అంచనాకు వచ్చారు. అందుకే నారా బ్రాహ్మణి  టీడీపీ తరపున యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేయాలని ఇంతకు మించిన తరుణం ఉండదని అంటున్నారు. క్యాడర్ అభిప్రాయాలపై నారా బ్రాహ్మణికి స్పష్టత ఉందేమో కానీ ఆమె కూడా రాజకీయ ప్రకటనలు ప్రారంభించారు. ప్రజా సమస్యలపై ప్రస్తావించడం ప్రారంభించారు. 


ప్రజాసమస్యలపై స్పందిస్తున్న నారా బ్రాహ్మణి 


 నారా బ్రాహ్మణి ఎగ్రెసివ్ గా ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు.  ఆమె అంగన్‌వాడి మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత పై పోలీసుల వ్యవహరించిన తీరుపై   ఘాటుగా స్పందించారు. ఏపీలో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస చూసి షాక్ కు గురవుతున్నానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్‌వాడి కార్మికులపై దాడులు దుర్మార్గమన్నారు. న్యాయం కోసం మహిళా నేతలు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతూంటే.. వారిపై దాడులకు పాల్పడటం శోచనీయమన్నారు. బ్రాహ్మణి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. 


రాజమండ్రి క్యాంప్ సైట్‌లో రాజకీయ సమావేసాలు


ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘిభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో రాజకీయాలు చర్చిస్తున్నారు. జనసేన నేతలు వచ్చి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. దాదాపుగా ప్రతి రోజూ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. లోకేష్ పై తాజాగా కేసు పెట్టారు.  ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా చేశారు. అందుకే బ్రాహ్మణి ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇక ముందు ఈ రాజకీయం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నరాు.  తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉందని..  ఒకరి తర్వాత ఒకరు పది లేయర్ల వరకూ నాయకత్వాన్ని ఖరారు చేసుకున్నారని పార్టీ నేతలంటున్నారు.  


నారా భువనేశ్వరి స్పీచ్‌లూ వైరల్ !


మరో వైపు సందర్భం వచ్చినప్పుడల్లా నారా భువనేశ్వరి స్పీచ్‌లు వైరల్ అవుతున్నాయి. ఆమె కూడా సందర్భం వచ్చినప్పుడల్లా పార్ఠీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆమె కూడా సూటిగా ..స్పష్టంగా తాను చెప్పాలనుకున్నది చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దర్నీ బయటకు రాకుండా కేసుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినా వీరిద్దరూ టీడీపీని విజయానికి  దగ్గర చేస్తారని టీడీపీ నేతలు నమ్మకంగా ఉన్నారు.