TS Cabinet Agenda :  అక్టోబరు మొదటి వారంలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. మొదటి విడతలోనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు సాదాసీదాగా వెళ్లకూడదని.. మెరుపులాంటి  పథకాలు  ప్రకటించి వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అందులో భాగంగానే కేబినెట్ భేటీ జరగబోతోందని తెలుస్తోంది. 


అదిరిపోయే స్కీముల్ని రెడీ  చేస్తున్నారంటన్న బీఆర్ఎస్ నేతలు 


ఎన్నికల షెడ్యూల్ వచ్చే గడువు దగ్గర పడుతూండటంతో అధికార బీఆర్‌ఎస్‌ అందుకనుగుణంగా స్పీడు పెంచుతోంది. ఎలక్షన్‌ తాయిలాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఓటర్లకు మరిన్ని హామీలివ్వనున్నారు. ఈ హామీలు, తాయిలాలపై చర్చించేందుకోసం ఈనెల 29న రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. ప్రస్తుత సర్కారుకు దాదాపు ఇదే ఆఖరి క్యాబినెట్‌ కానుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇటీవల ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. వీటిపై విస్తృత ప్రచాతరం చేస్తున్నారు. వాటికి ధీటుగా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గత ఎన్నికల్లో పింఛన్‌దారులు, రైతులు గెలిపించారు. ఈసారి కూడా వారే తమ పార్టీని ఆదుకుంటారని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందువల్ల ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం పెంపు తదితరాంశాలను ఎన్నికల ప్రణాళికలో ఆయన చేర్చనున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


ఎమ్మెల్సీలుగా మళ్లీ వారి పేర్లే సిఫారసు
 
నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా గతంలో మంత్రివర్గం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ తిరస్కరించారు. అయితే కేసీఆర్ మాత్రం వారి అభ్యర్థిత్వాల విషయంలో వెనక్కి తగ్గకూడదని అనుకుంటున్నారు.  మరోసారి క్యాబినెట్‌ వారి పేర్లను ఆమోదించి, గవర్నర్‌కు తిరిగి సిఫారసు చేయాలని అనుకుంటున్నారు.వీరిద్దరిపై ఎలాంటి కేసులు లేవు. రాజకీయ నేతలు అయి ఉండవచ్చు కానీ దాసోజు శ్రవణ్ ఫ్రొఫెసర్ అని.. కుర్రా సత్యనారాయణ కార్మిక వర్గాల నేత అని చెబుతున్నారు. వారిద్దరూ గవర్నర్ కోటాలో అర్హత ఉందని చెబుతున్నారు. ఏదైనా ఫైల్ గవర్నర్ తిరస్కరించినప్పుడు అదే ఫైల్ నుంచి రెండో సారి పంపితే ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గవర్నర్‌కు అంతకు మించి అధికారాలు ఉండవని టీఆర్ఎస్ నేతలు కూడా భావిస్తున్నారు. 


ఉద్యోగులకు వరాలు - మరికొన్ని వర్గాలకూ తాయిలాలు!  


 ఉద్యోగుల డీఏ పెంపు, వారికి సంబంధించిన ఇతర ప్రధానాంశాలు ఎన్నికల ప్రణాళికలో ఉండబోతున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‘నిరుద్యోగ భృతి’ని ఇస్తామంటూ ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు పథకాలు తమకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తాయని భావిస్తున్న సీఎం కేసీఆర్‌… వాటి తరహాలోనే మహిళా బంధు పథకానికి రూపకల్పన చేయబోతున్నారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.