రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనకు సమర్థింపుగా ఎవరూ మాట్లాడలేదు. టీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ మాటల్లో తప్పేమీ లేదని రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నాయని వాదిస్తున్నారు. అయితే అనూహ్యంగా  టీఆర్ఎస్‌కు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. కేసీఆర్ వ్యాఖ్యలను ఆ పార్టీ సంపూర్ణంగా సమర్థించింది. రాజ్యాంగం విషయంలో చర్చ జరిగితే మంచిదేనని ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 


Also Read: "కొత్త రాజ్యాంగం" వ్యాఖ్యలపై దుమారం - కేసీఆర్ తీరుపై ఇతర పార్టీల విమర్శలు !


కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు సమంజసమేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.  రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చని.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉండొచ్చు దీనిపై చర్చ జరగాలన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఖరారు చేస్తూ ఉంటారు. ఆయన మాట అంటే వైఎస్ఆర్‌సీపీ మాట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


Also Read: ఆ ఆలోచన పోకపోతే యువత సీఎం నాలుక కోస్తారు.. అందంతా బీజేపీ ప్లానే..: రేవంత్ రెడ్డి


తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన ప్రెస్‌మీట్లో నిజానికి ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.  ఏపీ ఎక్కడో ఉందని.. తెలంగాణతో అసలు పోలికే లేదన్నారు. అలాగే క్లబ్‌లు, గంజాయి లాంటివి తమ రాష్ట్రంలో లేవని సెటైర్లు వేశారు. గజానికి ఇంత అని వసూలు చేయమని కూడా సెటైర్ వేశారు. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు మనసులో పెట్టుకోలేదు. వివాదాస్పదం అయినప్పటికీ రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ డిమాండ్‌తో వాయిస్ కలిపేందుకు వెనుకాడలేదు. 


రాజ్యాంగం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని దళిత సంఘాలు.. ఇతర రాజకీయ పార్టీలు హెచ్చరికలు చేస్తున్నాయి. నిజానికి ఇది సున్నితమైన అంశం .  చాలా రోజులుగా రిజర్వేషన్ల ఎత్తివేతపై చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో రాజ్యాంగం మార్పు గురించి మాట్లాడితే కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పైగా ఇప్పుడు దేశంలో కేంద్రం సహా అనేక ప్రభుత్వాలు యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఆ సూచనలు చేసినందుకు సహజంగానే విమర్శలు వస్తున్నాయి. అలాంటి విమర్శలు తమకూ వస్తాయని తెలిసినా సజ్జల కేసీఆర్ను సమర్థించారు.