AP BJP Stars Plan :  దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అంతో ఇంతో బలం పుంజుకుంది. చాలా చోట్ల అధికారం చేపట్టింది. సిద్ధాంత పరంగా చోటు ఉండదనుకున్న త్రిపురలో అధికారం.. బెంగాల్లో అధికారానికి పోటీగా ఎదిగింది. తెలంగాణలోనూ సత్తా చూపుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతోంది. ఇన్‌స్టంట్ లీడర్స్‌తో చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. అయినా సరే బీజేపీ మరో ప్రయత్నం చేస్తోంది. పైకి చెప్పకపోయినప్పటికీ.. ఓ జనాకర్షక నేత తమ పార్టీలోకి వస్తే కానీ పుంజుకోలేమని అర్థం చేసుకుంది. అందుకే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దర్ని టార్గెట్ పెట్టుకుంది. మరి ఆ ఇద్దరిలో ఎవరైనా కదులుతారా ? ముందుకు వస్తారా ? బీజేపీని బలోపేతం చేస్తారా ? 


అటు చిరంజీవి .. ఇటు జూనియర్ ఎన్టీఆర్‌ని దువ్వుతున్న బీజేపీ ! 


ఏపీలో ఇప్పటికిప్పుడు ఓ ఊపు రావాలన్నా లేదా కొంత ఓటు బ్యాంక్ స్థిరంగా ఏర్పడాలన్నా.. ఓ జనాకర్షక నేత రావాలి. ఇతర రాజకీయ పార్టీల్లో ఆ స్థాయి నేతలు లేరు. గతంలో కన్నా లక్ష్మినారాయణ వంటి నేతలతో చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. అందుకే బీజేపీ తెలుగు సినీ స్టార్స్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరిపై గురి పెట్టి ప్రయత్నాలు చేస్తోందని తాజా పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరూ తమ పార్టీకి దగ్గర అని చెప్పుకునేందుకు ఇటీవలి కాలంలో బీజేపీ చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది. చిరంజీవి విషయంలో అయితే కాస్తంత ఎక్కువే ఆసక్తి చూపుతోంది. 


చిరంజీవిని తమ వాడిగా చేసేసుకున్న బీజేపీ ! 


ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కి 'ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ 2022' అవార్డు ప్రకటించారు.    దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరంజీవి ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ నేతలంతా చిరంజీవిని పొగిడేశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం భీమవరం వచ్చినప్పుడు ప్రధాని మోదీ.. చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. చర్చలు జరిపారు. అది రాజకీయ కార్యక్రమం కాదు అయినప్పటికీ ఆ కలయిక చర్చనీయాంశమే అయింది. ఇటీవలే పవన్ కల్యాణ్‌.. మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా కూడా.. చిరంజీవి కూడా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేలా చూడాలని  సూచించినట్లుగా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏం చర్చించామో బయటకు చెప్పబోమని జనసేన ప్రకటించింది కాబట్టి ఇవన్నీ ఊహాగానాలే.. కానీ.. చిరంజీవి విషయంలో బీజేపీ ఆసక్తిగా ఉందనేది మాత్రం వంద శాతం నిజం. ఆయన ఏ మాత్రం మొగ్గు చూపినా.. బీజేపీ అగ్రనాయకత్వ అందుకుంటుంది. కానీ చిరంజీవికి చాలా పరిమితులు ఉన్నాయి. అందులో మొదటిది జనసేన పార్టీ. తమ్ముడికి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వేరే పార్టీలో చేరడం అసాధ్యమన్న సంకేతాలు పంపించారు. 


జూనియర్ ఎన్టీఆర్‌నూ దువ్విన బీజేపీ !


కొన్నాళ్ల క్రితం అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించి మాట్లాడారు. ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు.కానీ సహజంగానే రాజకీయాలపై చర్చ వస్తుంది. అలా భేటీ ముగిసిన తర్వాత నుంచి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ తమకు ప్రచారం చేస్తారని ప్రకటించారు. సోము వీర్రాజు లాంటి నేతలు .. జూనియర్ ఎన్టీఆర్ తమకు స్టార్ క్యాంపెయినర్ అని ప్రకటించేసుకున్నారు. కానీ అమిత్ షా లాంటి పెద్ద మనిషి పిలిచినప్పుడు వెళ్లి కలవడం గౌరవం.. ఆ మేరకు వెళ్లాను..అంతకు మించి ఏం లేదన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ నింపాదిగా తన పన తాను చేసుకుంటున్నారు. 


ఎవరో ఒకరు ఆసక్తి చూపితే  బీజేపీ హైకమాండ్ ప్లాన్ ఫలించినట్లే !


రాష్ట్రాల్లో బీజేపీ ఎదగాలంటే... ఇలాంటి సూపర్ స్టార్లను క్యాచ్ చేయాలని బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆకర్షించింది తక్కువ. తమిళనాడులో రజనీకాంత్ ని కూడా ఒప్పించలేకపోయారు. ఏపీలో మరో ప్రయత్నం చేస్తున్నారు. కానీ బిజేపీ ఎంచుకున్న ఇద్దరు స్టార్లకు వారు ముందడుగువేయలేనంత రిజర్వేషన్స్ ఉన్నాయి. కట్టే కాలే వరకూ తెలుగుదేశమే అని జూనియర్ ఎన్టీఆర్ గతంలో ప్రకటించారు. సినిమా రంగంలో సాధించాను అనుకున్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ రాకపోవచ్చు. చిరంజీవి ఆల్రెడి వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. తమ్ముడు సొంత పార్టీతో రంగంలో ఉండగా.. తాను మరో పార్టీలో చేరడం అసాధ్యం. అదుకే బీజేపీ ప్రయత్నాలు్ మొదటి దశలోనే తేలిపోతున్నాయి.