జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... తన మొదటి అడుగు ఏపీలోనే పెట్టనున్నారా... ఇక్కడి నుంచే తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయనున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నేతలతో మంతనాలు జరిగాయని... ఇక కేసీఆర్‌ రంగంలోకి దిగబోతున్నారని బీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు.


బీఆర్‌ఎస్ బలోపేతం చేసేందుకు పక్కా కార్యచరణతో కేసీఆర్‌ అడుగులు పడుతున్నట్టు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఏపీ నుంచే ఇది మొదలు అవుతున్నట్టు పేర్కొంటున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో పర్యటించి పార్టీ బలోపేతంపై నేతలతో చర్చిస్తారు. తాను ఏపీలో ఎందుకు అడుగుపెట్టబోతున్నానో వివరించేందుకు భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖలో పర్యటన కోసం ఏర్పాల్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. 


ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఏపీ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించబోతున్నట్టు ఓ చర్చ కూడా నడుస్తోంది. ఇవాళ చంద్రశేఖర్‌తోపాటు మరో ఇద్దరు కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు,  మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి కూడా కారు ఎక్కనున్నారు. 
 
ఇది ప్రారంభం మాత్రమేనని ఇక రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని చూడబోతున్నారంటూ ఆ పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో నాగార్జున యూనివర్శిటీకి చెందిన విద్యార్థి విభాగం నాయకులు బీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తున్నట్టు ప్రకటించింది. కేసీఆర్‌ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తరచూ వాళ్లు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు మరో ముగ్గురు సీనియర్ నాయకులు కలిశారు. దీంతో రాజకీయం రంజుగా మారింది.  


ఇలా బీఆర్‌ఎస్‌లో ఏపీ లీడర్లు జాయిన్ అవుతున్నారు అని వార్తలు రాగానే మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో ఓ సంచలన ప్రకటన చేశారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా చేయకపోయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దమ్ము, ధైర్యం కేవలం ఒక్క కేసీఆర్‌కే ఉందని అన్నారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్న ఆయన తిరుమలేశుడికి మొక్కుకున్నట్టు తిరుమలలో ప్రకటించారు. ఏపీలోనే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఆలోచనలో పడ్డారన్నారు. సీఎం కేసీఆర్ కొద్ది మందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ 2024 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. 


త్వరలో బహిరంగ సభలు 


బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల్లో మంచి ఆదరణ వస్తోందని, త్వరలో వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారన్నారు. ఏపీ, తెలంగాణ రెండూ ఒకేసారి విడిపోయాయని, ఏపీని కూడా తెలంగాణలా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఏపీకి చెందిన ముప్పై శాతం ప్రజలు హైదరాబాద్ లోనే ఉన్నారన్నారు. తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలు అంతా తెలంగాణ అభివృద్ధిని చూస్తూనే‌ ఉన్నారన్నారు. ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కేంద్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిది ఏళ్లు గడుస్తుందని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. విభజనలో రకరకాల హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, స్పెషల్ స్టేటస్ మాటను మరిచిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వస్తే, విభజనలో ఇచ్చిన హామీలు కేసీఆర్ రాకతోనే పూర్తి అవుతుందన్నారు. కేవలం మూడేళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని, కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వక పోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము, ధైర్యం కేవలం కేసీఆర్ కే ఉందన్నారు. రాబోవు ఎన్నికల్లో ఏపీలో 170 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతామన్నారు. ప్రజల ఆదరణ వస్తుందని భావిస్తున్నామని, ఆంధ్రలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్నా అందుకే కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తెలియజేశారు.