టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు దుర్మార్గపు చర్య అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా వర్నిలో ఏర్పాటుచేసిన కమ్మ వారి ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు.


చంద్రబాబు అరెస్టు, ఆయనకు బెయిల్ రాకపోవడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో మరోసారి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు స్పీకర్ శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కమ్మవారి ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సభలో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైన చర్య అని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలోనే సీనియర్ నాయకులు మాజీ సీఎం చంద్రబాబు అని పోచారం వెల్లడించారు. చంద్రబాబు అనే  వ్యక్తిని గౌరవించాలన్నారు. దాదాపు 50 రోజులు అవుతున్నా బెయిల్ రాకుండా చూస్తున్నారని.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్ చేశారు. బాన్సువాడలో కమ్మ సోదరులకు కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.


చంద్రబాబు అరెస్టు పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలిసో తెలియకో తప్పులు జరుగుతాయి.. కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష గొప్పదని చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలంలో పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


"రాజకీయంగా కక్షలు పనిచేయవు. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఆయన తెలుగుదేశం కావొచ్చు, ఆయనను జైల్లో పెట్టడం అంత మంచి పద్దతి కాదు. ఆయన 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు.. తెలంగాణ, ఏపీలో పనిచేశారు. కక్ష అనేది మంచిది కాదు. అధికారం ఉంది కాబట్టి అవతలివాళ్లను మనం జైలుకి పంపిద్దాం, వాళ్లని శిక్షిద్దాం అనే భావన మంచిది కాదు" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇదే సమయంలో "ఇది పద్దతి కూడా కాదు" అని తెలిపిన ఆయన... తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో... "దేశంలో ఇటువంటివి జరగకూడదు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిదికాదు" అని అన్నారు. తనవద్దకు కూడా వచ్చి కొంతమంది బీజేపీ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు తిట్టారని చెబుతుంటారని... తిడితే వాళ్ల నోరే కరాబు అవుతాదని, తనకేమీ పోదని చెప్పినట్లు పోచారం చెప్పుకొచ్చారు. ఇక, తాను తప్పు చేస్తే కదా బయపడేది అని అన్నారు.


అందువల్లే తాను ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయనని, ఎవరూ కూడా చేయకూడదని అన్నారు. ఇదే క్రమంలో భగవద్గీతలో చెప్పినట్లు అని మొదలుపెట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డి... కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష మంచిదని, మనిషికి క్షమించే గుణం రావాలని, అది చాలా పెద్ద గుణమని అన్నారు. కక్ష అంటే.. పోలీసులను పిలిస్తే పట్టుకుని వెళ్లి లోపల వేస్తారు అని చెప్పిన ఆయన... అది మంచిదా అని ప్రశ్నించారు.


"తెలిసో తెలియకో తప్పులు జరుగుతాయి.. వాటికి క్షమించాలి, మన్నించాలి.. ఆ తప్పులు మరోసారి చేయకుండా బెదిరించాలి.." అని చెబుతూ చంద్రబాబు అరెస్టును మరొక్కసారి తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి! దీంతో... ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.