Telangana Congress :  కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికల గురించి వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతారని చెబుతున్నారు. ఎంత వరకూ చేరుతారో తెలియదు కానీ.. పార్టీ నుంచి వెళ్లిపోతారు అన్న నేతలు మాత్రం సైలెంట్ అయిపోయారు. అయితే అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరుతామని ప్రకటించిన తర్వాత కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. వారిలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్లు ఉండటంతో చర్చనీయాంశమయింది. 


కాంగ్రెస్‌లో జోష్ తగ్గించడానికి పుకార్లా ? నిజంగానే సీనియర్లు బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారా ?                                  


టీ పీసీసీ చీఫ్ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి నేరుగానే  హైకమాండ్ పై కూడా విమర్శలు చేశారు. తర్వాత అందరూ సర్దుకున్నారు.ఇటీవల ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత ప్రో యాక్టివ్ అయ్యారు. రేవంత్ తో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైకమాండ్ ను కలిసి తాము విబేధాలన్నీ మర్చిపోయి పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో అంతా సర్దుకుపోయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సైలెంట్ గా ఉన్న నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ నేతలు మాత్రం తాము పార్టీ మారుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారనే అంటున్నారు. తాము ఇతర పార్టీలతో టచ్‌లో లేమని అంటున్నారు. 


పార్టీ మార్పు ప్రచారాలు కొత్తవి కాదు.. చాలా కాలం నుంచి ఉన్నవే !


ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి  , జానారెడ్డిపై బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సమీప బంధువు పాడి కౌశిక్ రెడ్డి. తన రాజకీయ వారసుడు కౌశిక్ రెడ్డేనని ఉత్తమ్ చెబుతూంటారు . అలాంటి కౌశిక్ రెడ్డి  తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడే బీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ పొందారు . వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ టిక్కెట్ కూడా ఖరారు చేసుకున్నారు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఉత్తమ్ కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉత్తమ్ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా టీంను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ పుకార్లు మరింత పెరిగాయి. బీఆర్ఎస్‌తో కలిసి ఆయన కాంగ్రెస్ ను టార్గెట్ చేశారని చెప్పడం ప్రారంభించాు. ఇక జగ్గారెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన కు గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ లేకపోతే ఈ పాటికి బీఆర్ఎస్‌లో చేరేవారని అంటున్నారు. జానారెడ్డి తన రాజకీయ వారసుడి కోసం.. బీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నరాని చెబుతున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలప్పుడే ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. 


పార్టీలోనే కుట్ర జరుగుతోందని సీనియర్ల అనుమానం !


తమ పై పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న నేతలు వాదిస్తున్నారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ థాక్రే.. తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను పార్టీ మారడం ఏమిటని.. మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జగ్గారెడ్డి కూడా తాను పార్టీ మారడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతం మాత్రమే కాకుండా కాంగ్రెస్ బలహీనం చేయడానికి బీఆర్ఎస్ అధినేత సీనియర్లపై దృష్టి పెట్టారన్న ప్రచారమూ ఉంది. 


ఇప్పటికి ఎవరూ తాము కాంగ్రెస్ ను వీడిపోతామని చెప్పడం లేదు. కానీ వచ్చే కొన్ని నెలల్లో జరగబోయే పరిణామాల్ని మాత్రం అంచనా వేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. 









Join Us on Telegram: https://t.me/abpdesamofficial