TS Congress  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పాదయాత్రల జోరు పెరుగుతోంది. ఒక వైపు హాత్‌ సే హాతో జోడో అభియాన్‌ యాత్రలో భాగంగా ‘యాత్ర ఫర్‌ చేంజ్‌’ పేరుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గత నెల నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరో వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ‘పీపుల్స్‌ మార్చ్‌’ పేరుతో అదిబాలాబాద్‌ జిల్లా భోథ్‌ నియోజక వర్గం పిప్పిరిలో గురువారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇద్దరు నాయకులు యాత్రలు చేసే విధంగా పార్టీ అధిష్టానమే ప్లాన్‌ చేసిందని, అందులో పెద్ద లెక్కనే ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.


పార్టీ ఇమేజ్ పెరిగెలా పాదయాత్రలకు ప్లాన్ 
 
పాదయాత్రలు పార్టీకే మైలేజ్‌ వచ్చే విధంగా కాంగ్రెస్‌ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకు ఈ ఇద్దరు నాయకుల యాత్రలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే పలు సూచనలు చేస్తూ ముందుండి నడిపిస్తున్నారు. అవసరమైతే పార్టీ సీనియర్లు కూడా తమ తమ సొంత నియోజక వర్గాల్లో కూడా ఎవరికి వారుగా యాత్రలు చేయాలని కూడా మాణిక్‌రావు ఠాక్రే సూచించారు. దీంతో కొందరు నాయకులు అక్కడక్కడా అడపాదడపా యాత్రలు కొనసాగిస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్లు.. జూనియర్లతో పాటు పాత, కొత్త పంచాయతీ నెలకొనడమే ప్రధాన కారణమని, ఈ యాత్రలో వాటన్నింటికి చెక్‌ పడుతోందన్న భావనలో ఉన్నారు.  రేవవంత్‌ రెడ్డి  ఫిబ్రవరి 6వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు. మొదటి విడతగా ఆరు పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో వరంగల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, నిజమాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలోని 42 నియోజక వర్గాల్లో యాత్ర చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్లాన్‌ చేసుకున్నారు.  అయితే రేవంత్‌రెడ్డి యాత్రకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మరి కొందరు సీనియర్లు దూరంగానే ఉన్నారు.  


భట్టి పాదయాత్రకు రేవంత్ వ్యతిరేకవర్గం మద్దతు 


 సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కూడా దాదాపు 40 అసెంబ్లీ  నియోజక వర్గాల్లో కొనసాగనుంది. ఉమ్మడి అదిలాబాద్‌లోని బోథ్‌ నియోజక వర్గంలో ప్రారంభమైన ఈ యాత్ర ఖమ్మం జిల్లాలో ముగుస్తుంది. ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. అందుకు పార్టీ శ్రేణులందరు హాజరై.. పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులందరికి అధిష్టానం పార్టఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో భట్టి యాత్రకు ఏఐసీసీ నాయకులు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు హాజరుకావడంతో పాటు సభలు విజయవంతమయ్యేలా చూస్తున్నారు. 


ఒక నేత మీద ఆధారపడకూడదని అనుకుంటున్న హైకమాండ్ ! 


ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ ఇమేజ్ తో ఆయన కుమారుడు పార్టీని చీల్చారు.  మెజార్టీగా పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌ తనయుడు వైసీపీ నేత జగన్‌ వైపు వెళ్లిపోవడంతో అక్కడ పార్టీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పార్టీకి బలమైన కేడర్‌ ఉన్నప్పటికి నాయకుల మధ్య నెలకొన్న లొల్లితో నష్టం జరుగుతుందనే అంశాన్ని గుర్తించిన అధిష్టానం.. నాయకులందరూ ముందుగా జనంలోకి వెళ్లే విధంగా ప్లాన్‌ చేశారు.


ఒక వ్యక్తితో యాత్ర చేయడం వల్ల పార్టీకి కాకుండా ఆయనకే మైలేజ్‌ వస్తుందని, అందుకు మరో సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రేవంత్‌రెడ్డికి ప్రత్యామ్నా యంగా సీఎల్పీ నేత భట్టిని అధిష్టానమే రంగంలోకి దింపిం దని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు చేస్తున్న యాత్రలతో వస్తున్న మైలేజీ పార్టీ ఖాతాలో పడే విధం గా అధిష్టానం జగ్రత్త పడుతోందని అంటున్నారు.