Vepada Chiranjeevi Rao Elected AS MLC - టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం

  
- తొలి రౌండ్ లెక్కింపు నుండే స్పష్టమైన ఆధిక్యత చూపిన చిరంజీవి  
- ఏ దశ లోనూ పోటీ ఇవ్వలేకపోయిన వైసీపీ అభ్యర్థి శీతంరాజు సుధాకర్


ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రతిపక్ష టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు వైసీపీ తరపున పోటీ చేసిన శీతంరాజు సుధాకర్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 11,551 రెండో ప్రాధాన్యత కోటా ఓట్లను వేపాడ చిరంజీవి సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దాంతో విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను వేపాడ రెండో ప్రాధాన్యత ఓట్లతో సాధించినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వేపాడకు కలిసి రావడంతో పాటు గ్రాడ్యుయేట్స్ ఆయనకు అండగా నిలవడంతో విజయం సాధించారని ప్రచారం జరుగుతోంది.


కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓటు
ఉత్తరాంధ్ర  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండో ప్రాధాన్యత ఓటు కీలకం గా మారింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో చెల్లని ఓట్లు తొలగించగా గెలుపు కోసం 94,509 ఓట్లు అవసరం అయ్యాయి. అయితే మొదటి స్థానంలో ఉన్న చిరంజీవి రావు కూడా 83 వేల ఓట్ల పరిధిలోనే ఉండిపోవడం తో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు వెళ్లారు అధికారులు. సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు రాగా, పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ 35,148 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అందులో తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. విజయానికి కావాల్సిన కోటా ఓట్లు  11,551 సాధించడంతో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.


నా విద్యార్థులు, వారి తల్లి తండ్రులే నన్ను గెలిపించారు : చిరంజీవి రావు
తన దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తనను గెలిపించారు అన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వేపాడ చిరంజీవి. తన సేవలు నచ్చడం. వారు తనపై విశ్వాసం ఉంచడం వల్లే  తాను గెలిచినట్లు చెప్పిన వేపాడ ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఈ ఎన్నిక తో రుజువైంది అన్నారు.


డా. వేపాడ చిరంజీవిరావు ప్రముఖ విద్యావేత్త, రచయిత, అర్ధశాస్త్ర అధ్యాపకులు. తెలుగుదేశం పార్టీ తరుపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. చిరంజీవిరావు చోడవరం నియోజకవర్గం పరిధిలోగల రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన వ్యక్తి. 2023 ఫిబ్రవరి మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు టీడీపీ తరుపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి అభ్యర్ధిగా డా.వేపాడ చిరంజీవిరావు పేరును ప్రకటించారు. నలభై రోజుల్లో చక్రం తిప్పి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 


వేపాడ చిరంజీవిరావు 20 ఏళ్లకు పైగా ఆర్‌సి రెడ్డి కోచింగ్‌ సెంటర్‌, ఇతర కాలేజీలలో ఎకానమీ లెక్చరర్‌గా చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా కోచింగ్‌ ఇస్తూ వేలాది మంది శిష్యులను తీర్చదిద్దారు. ఈ ఎన్నికల్లో ఆ శిష్యులు, గ్రాడ్యుయేట్స్, వేపాడ లాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉంటే సేవ చేస్తారని భావించి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు.