Telangana CM Revanth Political Mind Games:  తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మైండ్ గేమ్స్‌తో పతాక స్థాయికి చేరాయి. ఓ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు మమ్మల్ని కొన్నేళ్లు ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవద్దు  అని కోరడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. పైకి ఇది కేవలం ప్రగతి కాంక్షలా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఒక పక్కా  బ్రాండింగ్ పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Continues below advertisement

ప్రశ్నించడమే విపక్షం పని.. వద్దంటే ఎలా? 

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం తప్పులను ఎండగట్టడం, ప్రజల తరఫున నిలదీయడం ప్రతిపక్షాల ప్రాథమిక విధి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఏ ప్రాజెక్టు చేపట్టినా దాన్ని విపక్షాలు  అడ్డుకుంటున్నాయి  అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. పాలకపక్షం చేసే ఏ నిర్ణయాన్నయినా ప్రతిపక్షం వ్యతిరేకిస్తే.. దాన్ని రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే చర్య గా మార్చేయడం ఒక సులువైన రాజకీయ ఆయుధంగా మారింది. దీనివల్ల నిరుద్యోగ సమస్య, రుణమాఫీ లోపాలు లేదా ఇతర వైఫల్యాలపై ప్రజలు, ప్రతిపక్షాలు చేసే న్యాయమైన పోరాటాల తీవ్రతను కూడా తగ్గించేలా ప్రభుత్వం  అభివృద్ధి నిరోధకులు అనే లేబుల్ వేసే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.  మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ - మైండ్ గేమ్‌కు అసలైన కేంద్రాలు! 

Continues below advertisement

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ మైండ్ గేమ్‌కు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు , ఫోర్త్ సిటీ   భూసేకరణ వివాదాలే ప్రధాన కేంద్రాలుగా మారాయి. మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చడాన్ని బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా..  ప్రజలకు అందమైన నగరాన్ని ఇస్తుంటే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి  అని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ ప్రచార యుద్ధంలో.. సామాన్య ప్రజల స్థానభ్రంశం, పరిహారం వంటి క్షేత్రస్థాయి సమస్యలు పక్కకుపోయి, కేవలం క్రెడిట్ పాలిటిక్స్ ,  ఇమేజ్ డ్యామేజ్  రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి.  బీఆర్ఎస్ అస్థిత్వ పోరాటం.. బీజేపీ  ఒక్క ఛాన్స్  వ్యూహం! 

మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేందుకు మూసీ, ఫ్యూచర్ సిటీ బాధితుల పక్షాన నిలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో దూసుకుపోతే.. రాబోయే ఎన్నికల నాటికి తమకు స్పేస్ దొరకదనే భయం గులాబీ దళంలో ఉంది. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ హయాంలో సాగుతున్న భూసేకరణ, హైడ్రా  మార్క్ కూల్చివేతలపై గళమెత్తుతూ.. తాము మాత్రమే ప్రత్యామ్నాయ శక్తినంటూ ఒక్క ఛాన్స్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.  ఎజెండాను డైవర్ట్ చేయడంలో రేవంత్ మార్క్ సక్సెస్! 

రాజకీయ వ్యూహకర్తగా రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేయడంలో సఫలీకృతులవుతున్నారనే చెప్పాలి. నిరుద్యోగుల నిరసనలు, గ్యారంటీల అమలుపై విపక్షాలు గట్టిగా నిలదీస్తున్న ప్రతిసారీ.. రేవంత్ రెడ్డి  హైడ్రా ,  మూసీ ,  ఫ్యూచర్ సిటీ  వంటి భారీ ప్రాజెక్టుల ఎజెండాను తెరపైకి తెస్తున్నారు. తద్వారా పాత సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడమే కాకుండా, తాము భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం కోసం కష్టపడుతుంటే.. కేసీఆర్, కిషన్ రెడ్డిలు దాన్ని అడ్డుకుంటున్నారనే నరేటివ్‌ను సెట్ చేయడంలో సీఎం కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఒక ప్రభుత్వం ప్రశాంతంగా ఐదేళ్లు పనిచేసుకోవాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ, ఆ నెపంతో ప్రతిపక్షాల విమర్శలను, ప్రజల ఆవేదనలను పూర్తిగా పక్కనబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను  ప్రగతి నిరోధక చర్యలు గా చూడకుండా, ప్రాజెక్టుల లోపాలను సరిదిద్దుకునే నియంత్రణ సాధనాలు గా   ప్రభుత్వం భావించాన్నఅభిప్రాయం వినిపిస్తోంది.