Telangana BJP :  తెలంగాణ బీజేపీ నేతల్లో  అంతర్గత వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పాత నేతలు, కొత్త నేతల మధ్య పంచాయతీ కొనసాగుతోంది. దీంతో పలుమార్లు బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి మారుస్తారన్న ప్రచారం జరిగింది. దీనికి అమిత్ షాతో జరిగిన మీటింగ్‌లో క్లారిటీ  ఇచ్చారని చెబుతున్నారు. బండి సంజయ్‌ నేతృత్వంలోనే అసెంబ్లి ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. అధ్యక్షుడి మార్పు ఇప్ప ట్లో ఉండదని నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తెలం గాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరి నట్లుగా తెలుస్తోంది. 


బండి సంజయ్ పై మోదీ, షాలకు గట్టి నమ్మకం ! 


తెలంగాణలో గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న  హోంమంత్రి అమిత్ షా.. ఎప్పటికప్పుడు  రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.  తెలంగాణలో తాజా పరిస్థితులను అధ్య యనం చేసిన అమిత్‌ షా, నడ్డా బండి సంజయ్‌ నాయ కత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.  సంజ య్‌ నాయకత్వంపట్ల ప్రధాని నరేంద్రమోడీకి కూడా  నమ్మకం ఉంది. పలుమార్లు మోదీ .. బండి  సంజయ్‌ను అభినందించారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి జాతీ యస్థాయిలో ప్రత్యామ్న్యాయ పదవులు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.  జేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బండి సంజయ్‌ నాయకత్వంలో పార్టీ ఎంతో బలోపేతమైం దని ఆయన చేస్తున్న పోరాటాలు, నిర్వ హించిన ప్రజా సంగ్రామ యాత్రల వల్ల  బీజేపీ బలపడిందని  హైకమాండ్ నమ్ముతోంది. ఇటీవల జరిగిన బీజేపీ ప్లీనరీ సమావేశంలోనూ బండి సంజయ్‌ పనితీరును ప్రశంసించారు. అందుకే  ఆయనను తప్పించడానికిఅవకాశం లేదని చెబుతున్నారు. 


తెలంగాణ నేతల అంతర్గత వివాదాలతో చేరికలు ఆలస్యం ! 
 
బండి సంజయ్‌ను మార్చాలని కొంత మంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ గెలిస్తే..   బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న వారికే సీఎం పోస్టు లభిస్తుంది. అందుకే ఆయనను తప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. కానీ  బండి సంజయ్‌ నాయకత్వంలో కచ్చి తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరు తుందని పార్టీ సీనియర్లు ఆయనతో సమన్వయం చేసుకుని ప్రజలకు చేరువై పనిచేయాలని కోరినట్లు  తెలుస్తోంది.  రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు పార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ ప్రయత్నాలకు పార్టీ పెద్దలు అడ్డుకట్ట వేయడంతోపాటు భవిష్యత్‌లో బండి సంజయ్‌ నేతృ త్వంలోనే పార్టీ ముందుకువెళ్తుందన్న  స్పష్టత ఇచ్చారు. బండి సంజయ్ ను మారిస్తే పెద్దఎత్తున చేరికలు ఉంటాయనే సంకేతాలు పంపిన హైకమాండ్ సంజయ్ పైనే నమ్మకం పెట్టుకుంది. 


కొత్త నేతలకు జాతీయ స్థాయిలో పదవులు ! 


కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వారం, పది రోజుల్లో వాళ్లలో కొంతమందికి జాతీయస్థాయిలో కీలక పదవులను కట్టబెట్టే అవకాశాలు  ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  సంజయ్‌ను విభేదిస్తున్న పలువురు నేతలతో సమావేశమైన అమిత్‌ షా , నడ్డా వారు చెప్పినవన్నీ ఆలకించారు. అంతిమంగా కలిసి పని చేయాలని  సూచించారు. మొత్తంగా సంస్థాగత అంశాలు చర్చించామని తరుణ్ చుగ్ కూడా ప్రకటించారు.  ఇక సంజయ్ ఇప్పుడు హైకమాండ్ ఇచ్చిన శక్తితో మరింత దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అందుకే సంజయ్.. ఇప్పుడు..   రేపిస్టుల ఇళ్లపై బుల్డోజర్లు పంపుతానని ప్రకటించేస్తున్నారు.