Telangana BJP Operation Akarsh:  తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాలను కైవసం చేసుకుని, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్న కమలదళం, ఇప్పుడు  మిషన్ 2028  లక్ష్యంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే కాకుండా, బీఆర్ఎస్‌ను మూడో స్థానానికి పరిమితం చేసేలా బీజేపీ అగ్రనాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 

Continues below advertisement

 బీఆర్ఎస్ ఖాళీయే లక్ష్యంగా  ఆపరేషన్ ఆకర్ష్ 

తెలంగాణలో పదేళ్లపాటు చక్రం తిప్పిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతుండగా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది. కానీ ఇప్పుడు రూటు మార్చాలనుకుంటోంది. నియోజకవర్గస్థాయి నేతలు లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది.  ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, బలమైన కేడర్‌ను ఆకర్షించడం ద్వారా పార్టీని బలోపేతం  చేయాలని డిసైడయింది.  బీఆర్ఎస్ రాజకీయ ఉనికి ముగిసింది అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపడం ద్వారా, ఆ పార్టీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది.

Continues below advertisement

 క్షేత్రస్థాయి వ్యూహాలు 

బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్ , కేంద్ర మంత్రి  బండి సంజయ్ భిన్నమైన వ్యూహాలతో పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంతర్గత పరిణామాలు తెలిసిన ఈటల, ఆ పార్టీలోని అసంతృప్త నేతలతో టచ్‌లో ఉంటూ  ఆపరేషన్ ఆకర్ష్ ను పర్యవేక్షిస్తుండగా.. బండి సంజయ్ తనదైన శైలిలో హిందూత్వ ఎజెండా, యువతను ఆకట్టుకునేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. సంస్థాగతంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు నిలుపుకుంటూనే, బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో పార్టీని విస్తరించడమే వీరిద్దరి ప్రధాన లక్ష్యం.

 తెలంగాణలో  కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ  పాలిటిక్స్? 

రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు క్రమంగా ద్వైపాక్షికంగా మారుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్న పోరు, ఇప్పుడు  కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా రూపాంతరం చెందుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బలం, రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజాదరణను చూపిస్తూ.. భవిష్యత్తులో కాంగ్రెస్‌ను ఢీకొట్టే ఏకైక శక్తి బీజేపీయేనని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉనికిని క్రమంగా దెబ్బతీస్తూ, ఆ పార్టీకి ఉన్న  ప్రధాన ప్రతిపక్ష  స్థానాన్ని ఆక్రమించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు.

 బీఆర్ఎస్  సమస్యలు. బీజేపీకి ప్లస్ అవుతాయా ?  బీఆర్ఎస్ నుంచి వలసలు పెరగడం వల్ల ఆ పార్టీ కేడర్ చెల్లాచెదురవుతోంది.  గతంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన ఓటర్లు ఇప్పుడు బీఆర్ఎస్‌ను బలహీనంగా భావించి, కమలం వైపు చేరుతారని నమ్ముతున్నారు.   2028 నాటికి తెలంగాణలో అధికారం చేపట్టడం అసాధ్యం కాదని పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న మాట వాస్తవం. పార్లమెంట్ ఫలితాల జోష్‌ను అలాగే కొనసాగించి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తేనే  మిషన్ 2028  విజయవంతం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా దెబ్బతీసి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ ఎంతవరకు సఫలమవుతుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.