సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై గట్టిగా పట్టుబడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అయినా... మహిళా బిల్లును ఆమోదించాలి డిమాండ్‌ చేస్తున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత.  పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అయినా మహిళా బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని రాజకీయ పార్టీలను కోరారామె. 


రాజకీయ విభేదాలను పక్కనబెట్టి... రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు 47 రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖ రాశారు కవిత. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం  మద్దతు పలకాలని కోరారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే.. దేశం పురోగమిస్తుందని లేఖలో ఆమె అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరారు. లింగ సమానత్వం, సమ్మిళిత పాలనకు మహిళా బిల్లు చాలా కీలకమని.. అయినా, ఆ బిల్లు చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉండిపోయిందన్నారు. 


ప్రజాస్వామ్యంలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడం చాలా ముఖ్యమన్నారు. దేశ జనాభాలో 50 శాతం వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్న కవిత.. చట్ట సభల్లో మాత్రం మహిళలకు ఓటు లభించడం లేదని అన్నారు. అందుకే అందరం కలిసి మహిళా బిల్లు కోసం పట్టుబట్టాలన్నారు. అన్ని పార్టీలు కలిసి వస్తేనే.. కేంద్రం దిగివస్తుందన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో మహిళా బిల్లుపై అందరు కలసి కట్టుగా ఒత్తిడి పెంచాలని కోరారు కవిత. 


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, NCP చీఫ్‌ శరద్ పవార్, AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏపీ సీఎం, YSCP అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితోపాటు దేశంలోని పలు రాజకీయ పార్టీల అధ్యక్షులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహిళా బిల్లు ఆవశ్యకతను గుర్తించి.. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేఖ ద్వారా కోరారు. ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల అజెండా ఏంటో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అయితే... ఇప్పటికే రాజ్యసభలో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ బిల్లు... లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు చేపడుతున్న కేంద్రం... ఇప్పుడైనా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు కవిత.


రాజ్యాంగ సవరణలతో త్వరలోనే పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారాయన. 2047 నాటికి ప్రపంచ శక్తిగా ఎదుగుతామన్నారు. మహిళా రిజర్వేషన్‌ ముందుగా జరిగితే... 2047 కంటే ముందే నెంబర్‌-1 స్థానంలో ఉంటామన్నారు. జైపూర్‌లో విశ్వవిద్యాలయ మహారాణి మహావిద్యాలయ బాలికలతో జరిగిన ఇంటరాక్టివ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌.