తెలంగాణలో రాజకీయంగా మళ్లీ పునర్‌వైభవం కోసం టీడీపీ సమాయత్తమవుతుంది. ఇటీవల కాలంలో పార్టీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను నియమించిన పార్టీ మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది. ముందుగా పట్టున్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 


తెలంగాణలో రీబౌన్స్ అయ్యేందుకు యత్నిస్తున్న టీడీపీ ముందుగా తనకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టింది. ఆది నుంచి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి మంచి క్యాడరే ఉంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తన సత్తాను చాటింది. సత్తుపల్లిలో విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న రెండు స్థానాలు కూడా ఖమ్మం జిల్లావే. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య విజయం సాధించారు. ఆయన ఆస్థానం నుంచి సైకిల్ గుర్తుపై హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వాళ్లిద్దరూ సైకిల్‌ దిగి కారు ఎక్కేశారు. 


ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు ఇక్కడ కూడా రాజకీయంగా మళ్లీ పుంజుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు తెలంగాణ పగ్గాలు అప్పగించారు. ఇదే ఊపు కొనసాగించేలా ప్లాన్స్ వేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


ముందుగా పట్టున్న జిల్లాల్లో క్యాడర్‌ను పునరుత్తేజం నింపేందుకు కార్యాచరణ చేపట్టారట. దీనికి ముందుగా ఇప్పటికీ మంచి ఓటు బ్యాంకు, లీడర్లు ఉన్న ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి గట్టి పట్టుంది. పార్టీకి విధేయత ప్రకటించే సామాజిక వర్గం ఖమ్మంలో గట్టిగా ఉండటంతో టీడీపీ ఇక్కడ బలోపేతంగా మారింది. వీటన్నింటినీ అనుకూలగా మార్చుకొని తిరిగి పుంజుకోవాలనే భావనతో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే టీడీపీ దృష్టి సారించినట్లు సమాచారం. 


టీడీపీకి తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే భిన్నంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్యాడర్‌ బలంగా ఉంది. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. టీడీపీ నుంచి బలమైన నాయకులుగా ఉన్న వారు వేరే పార్టీలకు వలస వెళ్లినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండటంతోపాటు ఇక్కడ ఎక్కువగా ఏపీతో సంబంధాలు ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఖమ్మంపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. 


లక్ష మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు..






తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ పెద్ద ఎత్తున సభలు నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఖమ్మంలో మాత్రం భారీ బహిరంగ సభ విజయవంతం చేయడం ద్వారా తెలంగాణలో తమ సత్తా చాటాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం ఈ నెల 21న ఖమ్మంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు టీటీడీపీ సన్నద్దమైంది. లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానాన్ని ఎంచుకున్నారు. తెలంగాణలో ఉన్న టీడీపీ సానుబూతిపరులను ఏకం చేయడం ద్వారా బలోపేతమే లక్ష్యంగా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమకున్న పూర్వవైభవాన్ని కేవలం ఏపీకి మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణలో కూడా పాగా వేసేందుకు టీడీపీ సన్నద్దం కావడం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.