2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజార్టీ సీట్లు సాధించడంపై రెండు పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. రాజమండ్రిలో తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో, రెండు పార్టీల నుంచి 14 మంది సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య,  పితాని సత్య నారాయణ, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహేందర్ రెడ్డి, కొటికల పూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస  యశస్విని హాజరయ్యారు. 


వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజమండ్రిలో ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల సమన్వయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షతో పాటు వివిధ ప్రజా సమస్యలు, నిత్యావసర ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపైనా దృష్టి సారించనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు.