TDP Support BJP :  మునుగోడు ఉపఎన్నికల పోరు హోరాహోరీగా ఉండటంతో  పోటీలోని పక్షాల మద్దతును కూడగట్టుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.  బీజేపీ అబ్యర్థి రాజగోపాల్ రెడ్డి .. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించడంతోనే ఆయనను రాజగోపాల్ రెడ్డి కలుస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  రాజగోపాల్ రెడ్డి చంద్రబాబును కలిసిన తర్వాత బీజేపీకి మద్దతుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 


మునుగోడులో పోటీకి దూరంగా టీడీపీ 


మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. వారం రోజుల కిందట తెలంగాణ టీడీపీ నేతలు .. చంద్రబాబును కలిసి మునుగోడులో పోటీ చేయాలన్న విజ్ఞప్తి చేశారు. పలువురు బీసీ నేతలు రెడీగా ఉన్నారన్నారు.  అద సమయంలో టీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కని బూర నర్సయ్య గౌడ్ కూడా పార్టీ తరపున పోటీకి ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని.. అసెంబ్లీ ఎన్నకిల్లా బలపడేందుకు ప్రయత్నిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించాలని భావిస్తున్నారు. 


టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు


నిజానికి తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధమయిందని..  ఢిల్లీ నుంచి కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ప్రతిగా ఏపీలో సహకరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రకారం... ప్రస్తుత పరిణామాలు అనుకూలంగా జరుగుతున్నాయి.  నిజానికి కోమటిరెడ్డి సోదరులు టీడీపీకి వ్యతిరేకం. టీడీపీతో పొత్తు వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెబుతారు. కానీ ఇప్పుడు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరారు. ఆయన టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్  పెద్దలు కూడా అదే సూచించడంతో ఆయన కూడా చంద్రబాబు మద్దతు అడగాలని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కల్లా టీడీపీని ఎంతో కొంత బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. బ లమైన బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయనకు టీ టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. 


టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో టీడీపీకి వెసులుబాటు


ఇప్పటి వరకూ తెలంగాణలో టీడీపీని ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేశారు. ఈ కారణంగాఆ పార్టీ ముందుకు సాగడం కష్టమంది. నేతలు పార్టీ వీడిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా  బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఈ తరుణంలో టీడీపీ బలపడటానికి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు.  అందుకే టీడీపీ జోరు పెంచాలనుకుంటోంది. బజేపీతో ముందుకు సాగాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.