AP BJP :  ఆంధ్రప్రదేశ్‌లో ఎలా బలపడాలనే అంశంపై బారతీయ జనతా పార్టీ విస్తృత కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ప్రజాపోరు కార్యక్రమం విజయవంతం కావడం, ప్రజా స్పందన,  గుర్తించిన సమస్యలు - వాటి పరిష్కారాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను చర్చించేందుకు రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి. సోము వీర్రాజు ఆధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలకు  ముఖ్యఅతిధులుగా భాజపా జాతీయ నాయకులు, రాష్ట్ర ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌, సహ ఇన్‌ఛార్జి   సునిల్‌ దేవధర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురంద్వేరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జాతీయ స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 


పార్టీ బలోపేతం లక్ష్యంగా సమావేశాలు


వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలపై ఉద్యమాలు, పోరాటాల రూపకల్పన, పార్టీ బలోపేతం లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల రెండో రోజు ఆదివారం జ  భాజపా జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జులు, ప్రజాపోరు వీధి సమావేశాల అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో విస్తృత స్ధాయి సమావేశం జరుగుతుంది . 2024 ఎన్నికలే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో చేపట్టనున్న ప్రజా ఉద్యమాలపై సమావేశం కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి చెబుతున్నారు.  


టీడీపీ, వైసీపీల వల్ల రాష్ట్రంలో పరిస్థితి అన్న సోము వీర్రాజు 


కోట్లాది మంది పేదల కోసం మోడీ అనేక పధకాలు అమలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. ఒక్క ఏపీలోనే రెండు కోట్ల మందికి ఎల్ఈడీ బల్బులు ఇచ్చారన్నారు. వైసీపీ, టీడీపీ తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీని రాజకీయాల కోసం రావణ కాష్టంగా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ, వైసీపీ విధానాల వల్లే ఇప్పుడు ఏపీలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి చేయలేని పార్టీ లు, అవినీతి పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు సోము వీర్రాజు. సీపీఐపైనా సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా ఒక్క స్థానం లేని పరిస్థితి కి ఎందుకు వచ్చిందని అంతర్మథనం చేసుకోవాలన్నారు. జాతీయ సమావేశాల్లో వారు చర్చించుకోవాలన్నారు. సిద్దాంతపరమైన రాజకీయ పార్టీగా బీజేపీ అభివృద్ధి చెందుతుందన్నారు.  పేదల పార్టీ అని చెప్పుకునే సీపీఐ నాయకులు బీసీకి ఎందుకు పార్టీ పగ్గాలు అప్పగించ లేదని ప్రశ్నించారు. 


మూడు రాజధానులకు  బీజేపీ వ్యతిరేకమన్న మురళీధరన్


మూడు రాజధానుల పేరుతో విశాఖను దోచుకోవడానికే వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌ స్పష్టం చేశారు. అమరావతికే బీజేపీ మద్దతు ఇస్తోందన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకమన్నారు.  వైఎస్ఆర్‌సీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. అవినీతి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 


సోము వీర్రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు


మరో వైపు శనివారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున నేతలకు శుభాకాంక్షలు చెబుతున్నారు.