Tdp Chief Chandrababu Election Campaign: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచార ప్రణాళికలు ముమ్మరం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఈ నెల 27 నుంచి 'ప్రజాగళం' (Prajagalam) పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 31 వరకూ వివిధ సభలు, రోడ్ షోలు, నియోజకవర్గాల పర్యటనల్లో ఆయన పాల్గొననున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు, పర్యటన సాగేలా షెడ్యూల్ రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 


పూర్తి షెడ్యూల్ ఇదే


ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటన ఉండనుంది. అనంతరం సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.


మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఆదివారం తాడేపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు.


పిఠాపురం నుంచి పవన్


జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఆయన పిఠాపురం నుంచి బరిలో నిలవగా.. అక్కడి నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని.. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. శక్తిపీఠం కొలువైన స్థలం.. శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేశారు. పవన్ కల్యాణ్ 3 రోజులు పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పురుహూతికా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్నారు. కాగా, పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.


'విజయం మనదే'


వచ్చే ఎన్నికల సమరంలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిదే కచ్చితంగా విజయమని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. 'నేను పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. జనసేన శ్రేణులు ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాం. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు పాటించడంపైనా జనసైనికులు పూర్తి అవగాహనతో ఉండాలి.' అని జనసేనాని స్పష్టం చేశారు. 


Also Read: YSRCP MLA Varaprasad: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి