Tamil Nadu Governance Vijay Anti Corruption Strategy: సరికొత్త రాజకీయ వేదిక తమిళగ వెట్రి కళగం ద్వారా అధికారంలోకి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, పాలనలోనూ తన సినిమాల్లోని వన్ మ్యాన్ ఆర్మీ ఫార్ములాను అమలు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టేందుకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ ను ప్రారంభించడం ద్వారా ఆయన పెద్ద సంచలనానికే తెరలేపారు. సామాన్య పౌరులు ఎవరైనా లంచం అడిగితే నేరుగా డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించడం, పలువురు అధికారులపై ఆకస్మిక దాడులు చేయించి సస్పెండ్ చేయడం ప్రజల్లోకి శరవేగంగా వెళ్లింది. అయితే, సినిమా స్టైల్లో సింగిల్ క్లిక్తో వ్యవస్థలను మార్చడం రీల్పై సాధ్యమైనంత సులభంగా రియల్ లైఫ్లో సాధ్యపడదనే చర్చ మొదలైంది.
ప్రజల్ని వెంటనే ఆకట్టుకోవచ్చు!
పబ్లిసిటీ , సింబాలిక్ పాలిటిక్స్ పరంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలను తక్షణమే ఆకట్టుకునే అద్భుతమైన మార్గం. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కఠినంగా ఉందనే సందేశాన్ని ఇది నిమిషాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అధికార యంత్రాంగాన్ని, క్షేత్రస్థాయి అధికారులను భయంలో ఉంచడానికి ఇటువంటి చర్యలు ప్రారంభంలో బాగానే ఉపయోగపడతాయి. ముఖ్యంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం, లంచం ఆరోపణలు ఎదుర్కొన్న సొంత పార్టీ నాయకులపైనే తక్షణ విచారణకు ఆదేశించి పార్టీ నుంచి తొలగించడం ద్వారా విజయ్ తన జీరో టాలరెన్స్ బ్రాండ్ను బలంగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు.
కానీ అదే పనిగా ప్రజల్ని ఆకట్టుకోవడం కష్టం
అయితే, ఈ విప్లవాత్మక విధానంలో అసలైన సవాలు సాంకేతికత లేదా ప్రచారం కాదు.. ప్రాసెసింగ్ క్యాపాసిటీ . కోట్ల జనాభా ఉన్న తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రంలో వాట్సాప్ లైన్ తెరిచిన మరుక్షణమే వేలల్లో, రానురాను లక్షల్లో ఫిర్యాదులు వరదలా వచ్చిపడతాయి. వచ్చిన ప్రతి మెసేజ్లో నిజానిజాలు ఎంత? రాజకీయ కక్షసాధింపుతో పంపినవి ఏవి? బ్లాక్మెయిలింగ్కు వాడుకుంటున్నవి ఏవి? అని స్క్రీనింగ్ చేయడం ప్రభుత్వ వ్యవస్థలకు పెను సవాలుగా మారుతుంది. సరైన మౌలిక వసతులు, ఐటీ కేడర్, ఫాస్ట్ ట్రాక్ దర్యాప్తు యంత్రాంగాన్ని ముందే ఏర్పాటు చేయకుండా కేవలం నంబర్ ప్రాచుర్యంలోకి తెస్తే, ఆ ప్లాట్ఫామ్ త్వరలోనే ఓవర్రోడ్ అయి కేవలం మెసేజ్ల కుప్పగా మిగిలిపోయే ప్రమాదముంది.
స్పందించలేని వాటికే ప్రచారం ఎక్కువ
వ్యవస్థాగతమైన మౌలిక మార్పులు తేకుండా కేవలం ఫిర్యాదుల స్వీకరణకే ప్రాధాన్యత ఇస్తే అది కాలక్రమేణా ప్రభుత్వ స్పందన లేమి కి దారితీస్తుంది. రోజూ వేల సంఖ్యలో పౌరులు తమ సమస్యలను, లంచాల వీడియోలను పంపుతున్నప్పుడు.. అందులో కేవలం 1% లేదా 2% కేసులపై మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే, మిగిలిన 99% మంది ప్రజల్లో మా ఫిర్యాదును పట్టించుకోలేదు అనే అసంతృప్తి రెట్టింపు అవుతుంది. ఇది ప్రారంభంలో సంపాదించిన 'పాజిటివ్ ఇమేజ్'ను ఒక్కసారిగా 'నెగటివ్ యాంటీ-ఇన్కంబెన్సీ'గా మార్చేసే తీవ్ర రాజకీయ ముప్పును దాచి ఉంచింది. ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే మరియు బీజేపీలు విజయ్ సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నాలను కేవలం రీల్స్ గవర్నెన్స్ అంటూ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నాయి. అధికారిక బిజినెస్ రూల్స్, సివిల్ సర్వీస్ యాక్ట్లను దాటి కేవలం ఒక వాట్సాప్ లేదా సోషల్ మీడియా ఆధారంగా చర్యలు తీసుకోవడం ద్వారా బ్యూరోక్రసీలో నిరాశ నిండిపోతుందని, అధికారులు ప్రాసెస్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి భయపడి పరిపాలనా స్తబ్దత ఏర్పడుతుందని వారు విమర్శిస్తున్నారు. ప్రతి చిన్న దానికి విజిలెన్స్ దాడులు అంటూ భయపెడితే, వ్యవస్థలో పనులు వేగంగా జరగడానికి బదులు మరింత జాప్యం జరుగుతుందనే వదన రాజకీయ వర్గాల్లో ఉంది.
సినిమాల్లో ఒక డైలాగ్తో లేదా ఒక దాడుల సీన్తో కథ ముగిసిపోతుంది. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్వహణ అనేది సుదీర్ఘమైన మారాథాన్. వాట్సాప్ ద్వారా అవినీతిపై యుద్ధం ప్రకటించి మంచి ఆరంభాన్ని పొందిన విజయ్.. ఆ ఫిర్యాదుల ఒత్తిడిని తట్టుకుని, పారదర్శకమైన ఫలితాలను అందించకపోతే, ఈ వ్యూహమే ఆయన ప్రభుత్వానికి అతిపెద్ద రాజకీయ ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉంది.
