Roja supports DK in Congress alliance: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్.కె. రోజా తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకే (DMK) తరపున ప్రచార బరిలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా   బీజేపీకి  వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకునేందుకు ఏ మాత్రం ముందుకు రాని  న వైసీపీ, పొరుగు రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకేతో జతకట్టడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.                                             

రోజాకు తమిళనాడుతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, అక్కడి సినిమా రంగంలో ఆమెకున్న క్రేజ్‌ను డీఎంకే తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ప్రత్యేకించి తెలుగు మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న సరిహద్దు నియోజకవర్గాల్లో రోజాను ప్రచారానికి పంపడం ద్వారా ఓట్లను రాబట్టవచ్చని స్టాలిన్ సర్కార్ వ్యూహం రచిస్తోంది. డీఎంకే మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి రోజా తనదైన శైలిలో తమిళ ఓటర్లకు వివరిస్తున్నారు.                                                 

అయితే, ఈ పరిణామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారింది. కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ, తమిళనాడులో బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని ఢీకొంటున్న డీఎంకేకు మద్దతు తెలపడం వెనుక ఉన్న  రాజకీయ కోణాలను అంచనా వేయలేకపోతున్నారు.  డీఎంకేకు అనుకూలంగా ప్రచారం చేయడం అంటే పరోక్షంగా బీజేపీని వ్యతిరేకించడమేనని, ఇది భవిష్యత్తులో  వైసీపీకి సమస్యగా మారుతుందని అంచనా వేస్తున్నారు.             

తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకే-బీజేపీ మధ్య పోరు తీవ్రస్థాయిలో ఉంది. ఈ  కారణంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి తర్వాత రోజా తమిళ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని, బహుశా ఆమె భవిష్యత్తులో పూర్తిస్థాయిలో తమిళ రాజకీయాలకే పరిమితం కావొచ్చని కూడా తమిళ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి,  ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. అటు డీఎంకేకు మద్దతు ఇస్తూనే, ఇటు తన సొంత రాజకీయ ఉనికిని చాటుకోవడానికి రోజా ఈ అవకాశాన్ని వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది.