YS Sharmila on Mavigun: జగన్ మోహన్ రెడ్డిని ఊపిరి తీసుకోనీయకుండా విమర్శలు చేస్తున్న ఆయన సోదరి, APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ తాజా ప్రతిపాదన మావిగన్- MAVIGUN పై విపరీతంగా సెటైర్లు వేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న ఆమె YSRCP కొత్త రాజధాని డిమాండ్లపై పంచ్లు వేశారు.
అన్న జోక్ చేస్తే నవ్వొద్దా..?
MAVIGUN ప్రతిపాదనను షర్మిల తీసిపారేశారు. "మావిగన్ అనేది అద్భుతమైన ఐడియా అయితే.. మరి ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? గాడిదలు కాశారా లేక గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?" అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో జగన్ రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదని పైగా అధికారంలో వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చారని మండిపడ్డారు. MAVIGUN అనే ఓ తలతిక్క ప్రతిపాదన తెచ్చి.. దానిపై మమ్మల్ని స్పందించమంటున్నారు. "ఎవరైనా జోక్ వేసినప్పుడు నవ్వుకుంటాం. ఇది కూడా అంతే. దీనిపై స్పందన చెప్పాల్సిన పనేముంది?" అన్నారు.
పులివెందులకు 'అవి-గొడ్డలి' అని పెట్టు
జగన్ పేరు కలిసొచ్చేలా రాజధానికి పేరు పెట్టమంటున్నారు కదా.. మరి పులివెందులను ఎందుకు వదలడం అని ఆమె ప్రశ్నించారు. "అమరావతికి జగన్ పేరు కలిపి 'మావిగన్' అంటున్నారే.. మరి పులివెందులకు అవినాష్ పేరు మీద 'అవి-గొడ్డలి' అని పెట్టాల్సింది కదా!" అని పంచ్ వేశారు. గన్నులు.. గొడ్డళ్లు,నరకడం, చంపడం తప్ప వైసీపీకి వేరే సిద్ధాంతమే లేదని ఫైర్ అయ్యారు. మావిగన్పై YSRCP వైఖరిని విమర్శించినందుకే తనను 'దత్తపుత్రిక' అని వైసీపీ క్యాడర్తో చెప్పిస్తున్నారని.. బీజేపీకి అన్ని బిల్లులకూ మద్దతు ఇచ్చి, మోదీ కాళ్ల దగ్గర కూర్చున్న జగనే అసలైన దత్తపుత్రుడు" అంటూ ఘాటుగా విమర్శించారు. బహిరంగంగా పొత్తు పెట్టుకునే దమ్ము లేక, లోపాయికారీగా మోదీకి సలాం కొడుతున్నది జగనే అని షర్మిల అన్నారు.
విజయమ్మను అవమానించినందుకు బొత్స కన్నీళ్లు పెట్టుకోవలసిందే..
YSR మరణంపై చేసిన కామెంట్ల వ్యవహారంలో YSRCP నేత బొత్స కన్నీళ్లు పెట్టుకోవడంపై షర్మిల స్పందించారు. "బొత్స ఎందుకు ఏడ్చారో తెలియదు కానీ.. అసెంబ్లీలో వైఎస్ విజయమ్మను అవమానించినందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకోవలసిందేఠ అన్నారు. YS మరణంపై బాధపడిపోతున్న ఆయన.. అదే వైఎస్ను, ఆయన భార్య విజయమ్మను నిండు సభలో అవమానించారని గుర్తుచేశారు. బొత్స చేసిన దానికి విజయమ్మ చాలా బాధపడ్డారని ఇప్పటికైనా ఆయన పశ్చాత్తాపం చెంది విజయమ్మ క్షమాపణ చెప్పాలని సూచించారు.
