T Congress Alliance :  భావ సారుప్యం ఉండి కలసి వచ్చే పార్టీలతో పని చేయాలని ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇలా కలిసి పని చేయాలని అనుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. దీంతో అందరూ భారత  రాష్ట్ర సమితితో కాంగ్రెస్ పార్టీ  పొత్తుకు సిద్ధమయిందన్న అభిప్రాయానికి వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉద్దేశం ఏదైనప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర నేతలు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. పొత్తులు ఉంటాయి కానీ బీఆర్ఎస్ తో కాదని.. లెఫ్ట్ పార్టీలు.. కోదండరాం జనసమితి వంటి పార్టీతో పొత్తులు ఉంటాయని సంకేతాలు పంపుతున్నారు. 


టీడీపీ, బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదంటున్న రేవంత్ రెడ్డి !


పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలంగాణలో  పొత్తులపై  క్లారిటీ ఇచ్చారు.  వామపక్షాలు, తెలంగాణ జనసమితితో పొత్తులపై అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని కేడర్‌కు  సంకేతాలు ఇచ్చారు.   హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా పొత్తులపై రేవంత్‌ పలు సభల్లో ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా తనతో పాటు అందరు నాయకులు సమిష్టిగా కృషి చేస్తారని, వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. పొత్తుల విషయంలో హైకమాండ్ ఇప్పటికే స్పష్టతనిచ్చిందని.. బీఆర్ఎస్ విషయంలో ఎలాంటి పొత్తులు ఉండవని రాహుల్ గాంధఈ చెప్పారని అంటున్నారు. గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ .. ప్రస్తుతం దూరమయింది. బీజేపీకి దగ్గరవుతోంది. ఈ కారణంగా పొత్తులు పెట్టుకునే ఆలోచనలను పక్కన పెట్టేశారు. 


లెఫ్ట్ , జనసమితి పార్టీలపై పొత్తులకు రేవంత్ ఆసక్తి !


దేశ వ్యాప్తంగా కేరళ మినహా ఇతర చోట్లా కాంగ్రెస్ పార్టీతో  లెఫ్ట్ పార్టీలు రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నాయి. అయితే తెలంగాణకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీతో కన్నా బీఆర్ఎస్ తో వెళ్లడానికే ఆసక్తి చూపిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నకేసీఆర్..  కమ్యూనిస్టు పార్టీలు తన వెంట ఉండాలని అనుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కలిసి పని చేస్తామని చెబుతున్నారు. అయితే తెలంగాణలో పొత్తు ఉండాలంటే.. ఖచ్చితంగా కొన్ని సీట్లను లెఫ్ట్ పార్టీలకు ఇవ్వాలి. లేకపోతే పొత్తు పొడవడం కష్టమే. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో లెఫ్ట్ పార్టీలకు సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి లెఫ్ట్ పార్టీలకు పొత్తు సంకేతాలు పంపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనసమితి నేత కోదండరాం ..కాంగ్రెస్ తో పొత్తుకు ఎప్పుడో రెడీ అయ్యారు. ఆయనను రేవంత్  ఒప్పించారు. లెఫ్ట్ పార్టీలు ఇవాళ కాకపోతే.. సీట్ల సర్దుబాటు చేసుకునేటప్పుడైనా లెఫ్ట్ పార్టీలు తమ వద్దకు వస్తాయని రేవంత్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు.  


వామపక్షాలు,  కోదండరాం వల్ల కాంగ్రెస్ కు లాభమే ! 


తెలంగాణలో వచ్చే ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. రెండు, మూడు శాతం ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి. మునుగోడునే తీసుకుంటే.. అక్కడ లెఫ్ట్ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకే బీఆర్ఎస్‌ను గట్టెక్కించిందని చెబుతారు. తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష సానుభూతి పరులు మూడు నాలుగు శాతం అయినా ఉంటారు. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరాం అంటే ఉద్యమకారుల్లో సానుభూతి ఉంది. వీరి వల్ల ఎంత ఓటు బ్యాంక్ యాడ్ అయినా లాభమేనని రేవంత్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. వీరితో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రేవంత్ రెడ్డి అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో పొత్తుల గురించి ఎలాంటి చర్చలు ఆ పార్టీ కేంద్రంగా చేయడం లేదు. 


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులతోనే పోటీ చేయాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే పొత్తులు పెట్టుకునే చాన్స్ ఉన్న పార్టీల జాబితాలో బీఆర్ఎస్,  టీడీపీ లేవు. కానీ ఓటు బ్యాంక్ కలసి వచ్చే లెఫ్ట్ పార్టీలు, జనసమితితో మాత్రం కలిసి పని చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలదే చాయిస్.