Revant Corona :    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లారు. మునుగోడులో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ గౌరవ్ పాదయాత్రలో రేవంత్ పాల్గొనాల్సి ఉంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రేవంత్ కరోనా బారిన పడటంతో ఆ పాదయాత్రకు హాజరు కాలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గతంలోనూ రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. మూడో సారి ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. అయితే స్వల్ప, తేలిక పాటి లక్షణాలే ఉన్నందున  ఆయన ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ 


మునుగోడు ఉపన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేశారు.  స్పీకర్ కూడా వెంటనే ఆమోదించారు.  దీంతో  ఉపఎన్నిక రావడం ఖాయమైపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రాణసంకటమైన ఎన్నిక. కుంచుకోటలో కూడా పార్టీని గెలిపించుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న అంచనా ఉంది. అదే సమయంలో నల్లగొండ కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన వెంకటరెడ్డి పార్టీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నిక వ్యవహారాల్లో ఆయన  పాలు పంచుకోవడం లేదు. 


టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?


రేవంత్ జోక్యంపై నల్లగొండ సీనియర్ నేతల అసంతృప్తి 


నల్లగొండ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని ఆ జిల్లా సీనియర్ నేతలు హైకమాండ్ వద్ద ఫిర్యాదు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారక ముందు ఆయనను బుజ్జగించే బాధ్యతను .. అదే జిల్లాకు చెందిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకోలేదు. ఇప్పుడు కూడా ఉపఎన్నిక బాధ్యతలను నల్లగొండ జిల్లాకు కీలక నేతలుగా ఉన్నా తామే చూసుకుంటామని హైకమాండ్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎక్కువగా జోక్యం చేసుకుంటే..  మిగతా నేతలు పని చేసే చాన్స్ ఉండదని చెప్పినట్లుగా తెలుస్తోంది. 


మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?


మునుగోడులో రేవంత్ ఇక ముందు కీలకంగా ఉంటారా ? 


కారణం ఏదైనా పాదయాత్రకు వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి చివరి క్షణంలో కరోనా స్వల్ప లక్షణాలతో ఆగిపోయారు. ఇప్పుడు ఆ పాదయాత్రను నల్లగొండ జిల్లా సీనియర్లు ఉత్తమ్, జానారెడ్డితో పాటు భట్టి విక్రమార్క చూసుకోనున్నారు. ఇక  ముందు మునుగోడు ఉపఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా వ్యవహరిస్తారన్నది  కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది.