కుప్పంలో ఇంకా పొలిటికల్ హీట్ తగ్గలేదు. బుధవారం ఉదయం నుంచి మొదలైన రణరంగం రాత్రి వరకు కొనసాగింది. ఆ హీట్‌ మాత్రం ఇంకా పోలేదు. చంద్రబాబు మరో రెండు రోజులపాటు కుప్పంలో పర్యటిస్తారు. అంటే మరో రెండు రోజులు ఈ హీట్‌ ఉండబోతోందన్నమాట. 


కుప్పంలో ఉన్న చంద్రబాబు.. రెండో రోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. బూత్ కన్వీనర్‌లతో భేటీ అవుతారు. వారితో మాట్లాడి భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరిస్తారు. అనంతరం మరోసారి ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి పోలీసులు ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. 


బుధవారం జరిగిన ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఇకపై కూడా  బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు డిఎస్పి సుధాకర్ రెడ్డి. ఇప్పటికే పలువురు నాయకులు మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 






కుప్పం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రియాక్ట్ అవుతారేమో అన్న అనుమానంతో కీలక నేతలందర్నీ హౌస్ అరెస్టు చేశారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా నేతలందర్నీ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేని కోసం పోలీసులు ఈ కట్టడి చర్యలు తీసుకుంటున్నారో తెలియక నేతల అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై ఎలాంటి సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. 


ఇదేమి ఖర్మ పేరుతో టీడీపీ చేపట్టే కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి చంద్రబాబు ఇంటింటికీ తిరిగారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇలా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. 






కుప్పంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందని. త్వరలో ఇక జగన్ శకం ముగుస్తుందని చెప్పుకొచ్చారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం కుప్పంలో సీబీఎన్ మీడియాతో మాట్లాడారు


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు కన్నెర్ర చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో జగన్ లాంటి సైకో సీఎంను చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంపై పోలీసులను నిలదీశారు. పక్షపాతం ఎందుకని, అందరికి ఒకే రూల్ ఉండాలని పోలీసులను నిలదీశారు. తాను కుప్పం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని..ఈరోజు కార్యక్రమాలకు సంబంధించి డీజీపీ, జిల్లా ఎస్పీకి పంపించామన్నారు. తాము ఏ కార్యక్రమం చేయకుండా కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తెచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.