గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ రెండోసారి గెలుపొంది తూర్పు నియోజకవర్గంలో తన పట్టును నిరూపించారు. వివాదరహితుడైన గద్దె రామ్మోహన్, ఈ విడత ప్రతిపక్షంలో ఉండటం వల్ల నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులు చేయలేకపోయారు. అయితే ఎంపీగా ఉన్న కేశినేని నాని కేటాయించిన కొన్ని నిధులతో పనులు చేపడుతూనే, సొంత డబ్బులతో సామాజిక సేవ చేస్తూ ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతున్నారు. 


వైసిపి తూర్పు నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో టిడిపి తరఫున గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన అనంతరం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి తూర్పు టికెట్ పై దృష్టి సారించిన అవినాష్ నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునే దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. కరోనా సమయంలోనూ ఇంటింటికి వెళ్లి చేయూతనందిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎమ్మెల్యేగా లేనప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కృష్ణా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


వైసీపీలో చేరిన అనంతరం వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అవినాష్ తన సత్తా చాటారు. నియోజకవర్గంలో ఆరు డివిజన్లలో మినహా మిగిలిన అన్ని డివిజన్ల వైసీపీని గెలిపించి నియోజకవర్గంలో పట్టును పెంచుకున్నారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎమ్మెల్యే అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.


దేవినేని దూకుడు...


గతంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలోనూ టిడిపి నాయకుడు పట్టాభి ఇంటిపై తన అనుచరులతో దాడి చేయించింది అవినాషే అనే ప్రచారంతో వార్తల్లోకి ఎక్కారు. అదే సమయంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో దేవినేని అనుచరులే ప్రధాన పాత్ర పోషించారని ప్రచారం జరిగింది. ఇటీవల నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి తీరుపై సీఎం జగన్ దేవినేని అవినాష్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. దేవినేని అవినాష్‌కి రానున్న ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. తూర్పులో తన బెర్త కన్ఫర్మ్ చేసుకున్న అవినాష్ నియోజకవర్గం పై మరింత పట్టు సాధించే అంశంపై దృష్టి సారించి దూకుడును పెంచారు. 


అలర్ట్ అయిన ఎమ్మెల్యే గద్దె...


దేవినేని అవినాష్‌కు టికెట్ ఇస్తున్నట్టు క్లారిటీ రావడంతో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైతం అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్లో వైసిపి టిడిపి శ్రేణుల మధ్య చోటుచేసుకున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నిజయోజకవర్గంలో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు తెగబడటం కలకం రేపింది. ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా పని చేసిన మహిళ గడపగడప కార్యక్రమంలో తమ ప్రాంతానికి వచ్చిన అవినాష్‌ను సమస్యలపై నిలదీసింది. దీంతో అవినాష్ ఒకింత అసహనానికి గురయ్యారు. టిడిపికి వత్తాసు పలికే విధంగా ఉన్న ఆమె మాటల పట్ల స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికితో ఆ ఘటన సమసి పోయిందని అందరూ భావించారు. 


మరుసటి రోజు అనూహ్యంగా ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తన దృష్టికి వస్తున్న సమస్యలను పరిష్కరిస్తున్న అవినాష్‌ని నిలదీయడం జీర్ణించుకోలేని ఆయన అనుచరులు కొందరు మహిళా కార్యకర్తలను రాణి గారి తోటకు పంపి, అవినాష్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మహిళ వెనుక రాజకీయంగా ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆ మహిళ వైసిపి మహిళా కార్యకర్తలు మూకుమ్మడిగా ఇంటి పైకి రావడంతో వారితో వాగ్వాదానికి దిగింది. ఈ వివాదం ముదిరి ఆమె వైసీపీ మహిళా కార్యకర్త చెంప చెళ్ళుమనిపించింది. దీంతో స్థానిక మహిళలు వైసిపి కార్యకర్తల మధ్య సిగపట్ల పర్వానికి తెర తీసింది. 


పరస్పరం ఫిర్యాదులు...


జరిగిన ఘటన పరస్పరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఉనికి కాపాడుకునేందుకు గద్దె రామ్మోహన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్  గెలిచినప్పటికీ ప్రజలను పట్టించుకోకుండా షో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తన మనుగడ ఉండదని భావించి వైకాపా కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు ఇరు వర్గాలకు చెందిన మహిళలను అదుపులోకి తీసుకుని కృష్ణలంక స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళుతుండగా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గద్దె రామ్మోహన్ ,వైసిపి కి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. సమస్యలపై నిలదీస్తే దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు. టిక్కెట్లు ప్రకటిస్తేనే ఇలా రౌడీలతో దాడులు చేస్తే రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నారని తమ పార్టీకి చెందిన నాయకుడు పట్టాభి ఇంటిపై దాడులకు పాల్పడ్డారని సైతం విమర్శించారు. నియోజకవర్గంలో సమస్యలపై చురుగ్గా పని చేస్తున్న చెన్నుపాటి గాంధీ పై దాడికి పాల్పడి కనుచూపు పోయేలా చేశారని గుర్తు చేశారు.


రంగంలోకి ఎలమంచిలి రవి...


ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి సైతం స్పందించారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎలమంచిలి రవి ఒక్కసారిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాము తన పిల్లలను తానే తింటున్నట్లు వైసిపి కార్యకర్తలపైనే దాడులకు పాల్పడతారా అని దేవినేని వర్గీయులను ప్రశ్నించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు రవి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు జనసేన సైతం పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేత పోతిన మహేష్ కూడా జరిగిన ఘటనపై స్పందిస్తూ వైసీపీ తీరును తప్పు పట్టారు. మొత్తం మీద గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చలరేగిన దుమారం తూర్పు  నియోజకవర్గ రాజకీయాలను కుదిపివేసిందని చెప్పక తప్పదు.