ఒక వైపున మోదీ టూర్.. ఇంకో వైపున బీజేపీ నేతల్లో అసహనం పెరిగిపోతున్నాయి. ఏపీ బీజేపీలో నేతల మధ్య సఖ్యత లేకపోవటంతో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినా కూడా ఆ పార్టీ నేతల్లో మాత్రం చలనం లేకుండాపోయింది. దీంతో పార్టీ నాయకులు తలో మాట మాట్లాడటం, ఆ పైన అదిష్ఠానం నుండి సరైన సమాచారం, సపోర్ట్ లేకపోవటంతో ఏపీ బీజేపీ నేతల్లో అసహనం మరింగా పెరిగిపోతోంది.


విశాఖలో మోదీ పర్యటన..


ఏపీలో బీజేపీ పుంజుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు అధిష్ఠానం నుండి అందినంత సహకారం లభించటం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఎప్పటి నుండో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, ఆ ప్రభావం కొద్దోగొప్పో ఏపీపై ఉండాల్సిన పరిస్థితులు ఉన్నా, అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించకపోవటంతో బీజేపీ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించినప్పటికీ బీజేపీ నేతలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లేకుండా పోతోంది. దీంతో ఏపీలోని అధికార గణం బీజేపీ నేతలను అంతగా పట్టించుకోవటం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతుంది.


కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, వాటికి నిధులు విడుదలకు సంబంధించిన సమాచారం కనీసం ఏపీ నేతలకు అందటం లేదు. అంతే కాదు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటిస్తుంటే, బీజేపీ నేతలు చుట్టపు చూపుగా వెళ్లి స్వాగతం పలికి, ఎయిర్ పోర్ట్ నుండి సైడ్ అయిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి కేంద్ర మంత్రి వచ్చినప్పుడు రూట్ మ్యాప్ ను పార్టీ నేతల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర మంత్రులు ఆయా విభాలకు చెందిన అధికారులు చెప్పినట్లుగా నడుచుకుంటూ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.


ఇది పార్టీ నేతలకు ఇబ్బందిగా ఉందని ఇప్పటికే బీజేపీ నేతలు అధినాయకత్వానికి విన్నవింంచినా ఫలితం లేకపోయిందని పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా మోదీ పర్యటనకు సంబంధించిన విషయంలో కూడా అసలు పార్టీ నాయకులకు కనీసం సమాచారం అందటం లేదు. పార్టీ పరంగా కార్యకలాపాలను కేంద్ర నాయకత్వం చూసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర పార్టీతో టచ్ లో ఉండి నాయకులకు సమాచారాన్ని అందించాల్సి ఉన్నా  ఆ దిశగా సమాచారం అందటం లేదు. ఇదే రీతిలో కేంద్రంలోని మంత్రులు కూడా నడుస్తున్నారని దీంతో పార్టీ నేతల్లో అసహనం పెరుగుతుందని చెబుతున్నారు. మోదీ పర్యటకు సంబంధించిన సమాచారాన్ని కూడా వైసీపీ నేతలు మీడియాకు ప్రకటిస్తే తెలుసుకోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.


ఆజ్యం పోసిన వైసీపీ ఎంపీ విజయసాయి..


బీజేపీ నేతల అసహనంకు విజయసాయి వ్యవహరం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందని అంటున్నారు. ప్రధాని ఏపీలో పర్యటిస్తుంటే అంతకంటే ముందుగానే ఆ వివరాలను విజయసాయి మీడియాకు వెల్లడించారు. దీంతో బీజేపీ నేతలు ఖంగుతింటున్నారు. పార్టీ పరంగా కార్యకలాపాల నిర్వహణ, బాధ్యతలు బీజేపీ నేతలు చూసుకోవాల్సి ఉన్నా, ప్రధాని స్థాయిలో అధికారికంగా పర్యటనకు వస్తుంటే, కేంద్ర మంత్రులు, లేదా కేంద్రంలోని అధికారులు ప్రధాని వివరాలు షెడ్యూల్ ను ప్రకటించాల్సింది పోయి విజయసాయి రెడ్డి ప్రకటనలు విడుదల చేయటంపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు వీర్రాజు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. విజయ సాయి ఎలాంటి అధికారంతో ప్రధాని షెడ్యూల్ ను ప్రకటిస్తారని ప్రశ్నించారు. అయినా దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకుండాపోయింది.


బీజేపీలో కీలక చర్చ..
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పై బీజేపీ కోర్ కమిటిలో ఇప్పటికే చర్చ జరిగింది. అయితే ఈ సమావేశానికి నాయకత్వం వహించిన వీర్రాజు ప్రధాని షెడ్యూల్ కు సంబంధించిన సమాచారం కోర్ కమిటిలో ప్రస్తావించలేదు. దీంతో పార్టీ నేతల్లో మరింత ఆగ్రహం వ్యక్తం అయ్యిందని చెబుతున్నారు. రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీ నుండి కనీసం సమాచారం అందకపోవటంపై కోర్ కమిటి అభ్యంతరం తెలిపింది. కోర్ కమిటికే దిక్కులేనప్పుడు జిల్లా స్థాయిలో ప్రధాని మోదీ పర్యటకు ఎలాంటి రూట్ మ్యాప్ ను ఇస్తామని నేతలు అసహనం వెలిబుచ్చారు. వైసీపీ నేతల వద్దనే పూర్తి సమాచారం ఉంటుందని, పార్టీ పరంగా ప్రధాని షెడ్యూల్ ను కూడా తెలుసుకోలేకపోవటంపై నేతలు విస్మయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మి నారాయణ వ్యవహరించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళి స్వాగతం పలికే వారి జాబితాలో ఆయన పేరే లేకపోయిన అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో ఏపీలో మోదీ పర్యటననపై బీజేపీ నేతలు అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.