padayatra season in Telugu politics will start from 2027: తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అగ్రనేతలంతా జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాదయాత్రల జాతర మొదలుకాబోతోంది. ఒకప్పుడు అధికార మార్పిడికి అస్త్రంగా మారిన పాదయాత్రలు, ఇప్పుడు ఉనికిని చాటుకోవడానికి ,  వారసత్వ పోరులో పైచేయి సాధించడానికి ప్రధాన వేదికలుగా మారుతున్నాయి.

Continues below advertisement

జగన్ మాత్రమే కాదు.. షర్మిల కూడా ! 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబం మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు ఇప్పుడు వీధులపైకి చేరబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుమారు 18 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, ఆయన సోదరి షర్మిల  కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. రాజన్న వారసత్వంపై తమకే హక్కు ఉందని ఇద్దరు నేతలు ప్రజల్లోకి వెళ్తుండటం ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని వింత పరిస్థితిని కల్పిస్తోంది. కేవలం అధికార పక్షాన్ని విమర్శించడమే కాకుండా, సొంత కుటుంబ సభ్యుల మధ్యే ఈ యాత్రల పోటీ సాగనుంది.

Continues below advertisement

తెలంగాణలో కేటీఆర్‌తో పాటు కవిత కూడా !

తెలంగాణలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీకి పాత వైభవం తెచ్చేందుకు సిద్ధమవుతుంటే, ఆయన సోదరి కవిత స్వతంత్ర రాజకీయ ప్రయాణం మొదలుపెడుతున్నారు. కొత్త పార్టీ పెట్టగానే  పాదయాత్ర చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకే ఇంటి నుంచి అన్నచెల్లెళ్లు వేర్వేరు జెండాలతో ప్రజల ముందుకు రావడం అటు కార్యకర్తలను, ఇటు ప్రజలను అయోమయంలోకి నెట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలు గులాబీ దళంలో గందరగోళానికి దారితీస్తున్నాయి.

బండి సంజయ్ కూడా హైకమాండ్ అనుమతి కోసం ప్రయత్నాలు

మరోవైపు బీజేపీ అగ్రనేత బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర తదుపరి దశను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో ఆయన చేసిన యాత్రలు  మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి.  ఈ సారి కూడా తమదైన శైలిలో యాత్రలు చేపట్టి తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇలా అన్ని పార్టీల నేతలు రోడ్లపైకి రావడంతో తెలుగు రాష్ట్రాల వీధులన్నీ వచ్చే ఏడాది నుంచి జెండాలు, నినాదాలతో హోరెత్తిపోనున్నాయి.  

పాదయాత్ర అంటే చాలా కాస్ట్ లీ 

ఈ పాదయాత్రలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా భారీ ఆర్థిక కదలికకు కారణమవుతున్నాయి. నేతల రాక కోసం ఏర్పాటు చేసే సభలు, ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలు ,  సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కోసం కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది.  దీనివల్ల వేల మందికి తాత్కాలికంగా ఉపాధి  లభిస్తుంది. మీడియా సంస్థలు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఈ యాత్రల కవరేజీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతానాయి. ఒక రకంగా చెప్పాలంటే, రాజకీయం ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్‌లా మారిపోయింది.  ఈ పాదయాత్రలు ఎవరిని గెలిపిస్తాయి అనేది పక్కన పెడితే, ప్రజల మధ్య నేతలు నిరంతరం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమే. అయితే ఈ నడకలు ప్రజల కష్టాలను తీర్చడానికా లేక కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమా అనేది కాలమే తేల్చాలి.  2026 నుండి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గరం గరంగా ఉండబోతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. నేతల నడక ప్రజల తీర్పును ఎలా మారుస్తుందో వేచి చూడాలి.