Delimitation Bill 2026 Lok Sabha Expansion: భారత రాజకీయ యవనికపై అత్యంత భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం వేదిక సిద్ధం చేస్తోంది. ఒకేసారి మూడు చారిత్రాత్మక సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు చట్టసభల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. వన్ నేషన్-వన్ ఎలక్షన్ , నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు కోసం పార్లమెంట్లో ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లులు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలను సంపూర్ణంగా మార్చేయబోతున్నాయి. ఈ మూడు బిల్లుల కలయిక కేవలం ఎన్నికల సంస్కరణ మాత్రమే కాదు, ఇది భారత ఫెడరల్ నిర్మాణాన్ని, ప్రాతినిధ్య రాజకీయాలను సరికొత్త దిశకు తీసుకెళ్లే ఒక సుదీర్ఘ ప్రయాణం.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ - నిరంతర ఎన్నికల ఖర్చుకు బ్రేక్!
దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు భారత ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని, శ్రమను భారీగా తగ్గించడమే లక్ష్యంగా తెస్తున్నారు. పార్లమెంటరీ సంయుక్త కమిటీ అంచనాల ప్రకారం.. నిరంతరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 7 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల నిలిచిపోయే అభివృద్ధి పనులకు విముక్తి లభిస్తుంది. అయితే, మధ్యలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే, అక్కడ కొత్తగా ఎన్నికయ్యే సభ కేవలం మిగిలిన కాలపరిమితి కి మాత్రమే పరిమితం అవుతుందనే ప్రతిపాదన ప్రాంతీయ పార్టీలలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ విధానాన్ని 2029 కల్లా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది.
పునర్విభజనతో మారనున్న లెక్కలు!
1971 జనాభా లెక్కల ఆధారంగా స్తంభింపజేసిన లోక్సభ స్థానాల పరిమితిని సవరించి, నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం ప్రతిపాదించిన చట్టాల ప్రకారం.. లోక్సభ గరిష్ట స్థానాల సంఖ్యను 550 నుండి ఏకంగా 850కి పెంచే అవకాశం ఉంది. ఎవరికీ అన్యాయం జరగకుండా యాభై శాతం సీట్ల ఫార్ములాను తీసుకు వచ్చింది. గతంలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కావాలంటే జనాభా లెక్కలు, పునర్విభజన పూర్తి కావాలనే నిబంధన ఉండేది. కానీ, తాజా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగానే మహిళా కోటాను తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాబోయే 2029 సాధారణ ఎన్నికల నాటికి లోక్సభ , రాష్ట్రాల అసెంబ్లీలలో 33 శాతం స్థానాలు మహిళలకే దక్కుతాయి. ఇది భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని క్రింది స్థాయి నుండి అగ్రస్థాయి వరకు అనూహ్యంగా పెంచే విప్లవాత్మక మార్పు కానుంది.
సరికొత్త ప్రజాస్వామ్యం వైపు అడుగులు.. సవాళ్లు ఇవే!
ఈ మూడు మహా బిల్లులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పునర్విభజన జరిగితేనే పెరిగిన సీట్లలో మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి, ఆ సీట్ల ఆధారంగానే వన్ నేషన్-వన్ ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఈ స్థాయి భారీ రాజ్యాంగ సవరణలు కేవలం పార్లమెంట్లో సాధారణ మెజారిటీతో సాధ్యం కాదు. దీనికి రెండు పద్ధతుల ప్రత్యేక మెజారిటీ తో పాటు కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. ప్రాంతీయ పార్టీలను ఒప్పించడం, దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడటం, ఒకేసారి దేశవ్యాప్తంగా ఈవీఎంల సరఫరా వంటి భారీ లాజిస్టికల్ సవాళ్లు కేంద్రం ముందున్నాయి. ఇవన్నీ దాటుకుని బిల్లులు చట్ట రూపం దాలిస్తే, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం అవుతుంది. అయితే దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ఎన్డీఏ పెద్దలు ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
