ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు ఆడుతున్న ఓట్ల రాజకీయం ‌అధికారుల మెడకు చుట్టుకుంటోంది. అనంతపురం జిల్లాలోనే ఇద్దరు అధికారులపై వేటు పడింది.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారుల్లో గుబులు మొదలైంది.  పదులు, వందలు కాదు...వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో బయటపడ్డాయ్. ఎన్నికల సంఁఘం 6వేల దొంగ ఓట్లను గుర్తించింది. అనంతపురం జిల్లా పరిషత్ ప్రధాన ఎన్నికల అధికారి కె. భాస్కర్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 2021లో జడ్పీ సీఈవోగా పని చేసిన శోభాస్వరూపపైనా చర్యలు తీసుకుంది. 


ఉరవకొండ నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగించారని...వేల సంఖ్యలో  ఓట్లు తొలగించారంటూ ఏపీ పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్... గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఓట్లను తొలగించినట్లు నిర్ధారించించుకుంది. ఉపాధి కోసం వేరే  ప్రాంతాలకు వలస వెళ్లిన వారి.. ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియ కొనసాగించినట్లు తేలింది. 


ప్రతి జిల్లాలోనూ దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుంది. దీంతో మిగిలిన జిల్లాలోని అఁధికారుల్లోనూ వణుకు మొదలైంది. ఎన్నికల సంఘం విచారణకు వస్తే తమ బండారం బయటపడుతుందని లోలోపల ఆందోళనకు గురవుతున్నారు.  ఓటర్లకు ఎలాంటి నోటీసులు అందిచకుండానే ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని పార్టీలు ఆరోపిస్తున్నాయ్. 


అనంతపురం జిల్లా రాప్తాడు, ధర్మవరం, ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ నేతలు...కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేసారు.  పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లపై విచారణ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రానున్నట్లు తెలుస్తోంది. విచారణలో దొంగఓట్ల బాగోతం బయటపడితే...ఇంటికి పోక తప్పదా అని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ మధ్య తాము నలిగిపోవాల్సి వస్తుందని మథనపడుతున్నారు.