AP Politics : ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీ ఆశించినా 82,888 మెజార్టీ ఆ పార్టీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి సాధించగలిగారు. ఇంతకీ ఆత్మకూరు ఉపఎన్నికల ఫలితం చెప్పేదేంటి? రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మరో రెండేళ్లలో రాబోతున్న సందర్భంలో ఆత్మకూరు ఉపఎన్నికల ఫలితాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి? 


గణాంకాలు ఇలా 



  1. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,02,074

  2. బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 19,332

  3. బీఎస్పీకి వచ్చిన ఓట్లు 4,897

  4. నోటాకు వచ్చిన ఓట్లు 4179  

  5. ఇతరులకి 6599 ఓట్లు


పోస్టల్ బ్యాలెట్ల లెక్క కూడా తీస్తే విక్రమ్ రెడ్డి మెజార్టీ 82,888 అని తెలుస్తోంది.  


వైసీపీ హవా..


ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గౌతమ్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా విక్రమ్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. వైసీపీ బలం పెరిగిందనే చెప్పాలి. ఇక్కడ మేకపాటి కుటుంబంపై ఉన్న సింపతీ, వైసీపీ సంక్షేమ పథకాలు ఇలా కారణాలేవైనా వైసీపీ బలం మాత్రం పెరిగింది. 64 శాతం మాత్రమే పోలింగ్ జరిగినా ఈ స్థాయిలో మెజార్టీ వచ్చిందంటే ప్రచారంలో వైసీపీ కృషి ఫలించినట్టే అంటున్నారు ఆ పార్టీ నేతలు. 


బీజేపీ బలమెంత..?


ఏపీలో బీజేపీ సైజ్ ఎంత అంటూ మంత్రి అంబటి సెటైర్ వేసినా.. వాస్తవానికి బీజేపీ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ప్రతిపక్షాలేవీ పోటీలో లేనప్పుడు కూడా కనీసం బీజేపీకి 20 వేల ఓట్లు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. టీడీపీ, జనసేన సానుభూతిపరులెవరూ బీజేపీకి అనుకున్న స్థాయిలో ఓట్లు వేయలేదు. ఓ సామాజిక వర్గం మాత్రం బీజేపీ వెంటే ఉంది. బీజేపీ ఒంటరి పోరు ఏమాత్రం ఫలించలేదని చెప్పాలి. ఓటమి ముందే ఊహించినా మరీ డిపాజిట్ గల్లంతు కావడం ఆ పార్టీ నేతల్ని ఆలోచనలో పడేసింది.  


టీడీపీ, జనసేనకు క్లారిటీ.. 


పదే పదే వైసీపీ పథకాలపై విమర్శలు చేస్తున్న టీడీపీ, జనసేన ఈ ఉప ఎన్నికతో ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం అనే ఆరోపణలు వచ్చినా వైసీపీకి భారీ మెజార్టీ కట్టబెట్టారు ప్రజలు. దీంతో టీడీపీ, జనసేన ఆలోచన పడినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలను నమ్ముకున్న వైసీపీ ప్రచారం దూసుకుపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత అంటున్న ప్రతిపక్షాలు మాత్రం నీరసపడ్డాయి. ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.