BJP vs Congress NEET Controversy: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించిన నీట్   ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తన మూల రూపాన్ని వేగంగా మార్చుకుంది. ప్రారంభంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత లోపాలను నిరసిస్తూ క్షేత్రస్థాయిలో విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఇప్పుడు నెమ్మదిగా తెరవెనుకకు వెళ్లాయి. జాతీయ రాజకీయంలో ఈ అంశం ఇప్పుడు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్రమైన రాజకీయ సమరంగా  మారాయి.  విద్యార్థుల భవిష్యత్తు, సంస్కరణల అవసరం కంటే ఇరుపక్షాల రాజకీయ వ్యూహాలు, ప్రతిష్టే ఇక్కడ ప్రధానాంశాలుగా మారాయి. 

Continues below advertisement

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణలు

ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లడం, అనంతరం చోటుచేసుకున్న అరెస్టుల పర్వం ఈ వివాదానికి కొత్త రాజకీయ పరిమాణాన్ని ఇచ్చింది. రాహుల్ గాంధీ అరెస్ట్, నిరసనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వగా.. బీజేపీ సైతం అంతే దూకుడుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాల ముట్టడికి ప్రతి  పిలుపునిచ్చింది. ఈ పరిణామంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు విజయవాడలోని ఆంధ్రా రత్న భవన్, పట్నా, హైదరాబాద్‌లలో ఉభయ పార్టీల కార్యకర్తల నడుమ ఘర్షణలు, రాళ్లదాడి, తోపులాటలు చోటుచేసుకుని ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. సమస్య తీవ్రతను బట్టి క్షేత్రస్థాయి ఒత్తిడి పెంచడం కాంగ్రెస్ వ్యూహమైతే, ప్రతిపక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడానికి కౌంటర్ ఎటాక్ చేయడం బీజేపీ ఎంచుకున్న వ్యూహంగా కనిపిస్తోంది.

Continues below advertisement

పార్లమెంట్‌లోనూ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ 

ఈ క్లిష్ట సమయంలో న్యాయస్థానం ద్వారా తక్షణ ఉపశమనం పొందాలని భావించిన ఆందోళనకారులకు చుక్కెదురైంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల తీరు, నీట్ విచారణపై అత్యవసర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంగా నిరాకరించింది. సమయం వృథా చేయవద్దని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ల అత్యవసర లిస్టింగ్‌ను తోసిపుచ్చడంతో, ఈ అంశంపై కోర్టుల ద్వారా తక్షణ రాజకీయ సదుపాయం పొందాలనుకున్న శక్తులకు బ్రేక్ పడింది. దీనితో వివాద పరిష్కారం న్యాయపరిధి నుంచి మళ్లీ వీధులు, పార్లమెంట్ ప్రాంగణానికే పరిమితమైంది. పార్లమెంట్ ఉభయ సభలలోనూ నీట్ లీకేజీ వ్యవహారం ప్రతిష్టంభనకు ప్రధాన కారణమైంది. నిబంధనల ప్రకారం సభలో చర్చకు తాము సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం ముందు రాజీనామా – ఆపైనే చర్చ  అనే కఠిన నిబంధనను తెరపైకి తెచ్చాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఏ చర్చకూ సిద్ధపడేది లేదని కాంగ్రెస్ పట్టుబట్టడం వెనుక ఓ వ్యూహాత్మక లెక్కింపు ఉంది. మోదీ 3.0 ప్రభుత్వంలో ఒక కీలక మంత్రి రాజీనామా సాధించగలిగితే, అది ప్రతిపక్ష కూటమికి నైతిక విజయాన్ని ఇస్తుందని, ప్రభుత్వాన్ని రక్షణత్మక వైఖరిలోకి నెట్టవచ్చని విపక్షాలు భావిస్తున్నాయి.

చర్చకు సిద్ధమంటున్న బీజేపీ

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంతమాత్రం తగ్గేందుకు సిద్ధంగా లేదు. ప్రతిపక్షాల డిమాండ్‌కు తలొగ్గి మంత్రి రాజీనామాను ఆమోదిస్తే, అది తమ వైఫల్యాన్ని అంగీకరించినట్లవుతుందని, తద్వారా ప్రతిపక్షాలు మరింత బలపడతాయని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే, ప్రతిపక్షాలకు విద్యార్థుల భవిష్యత్తు, సమస్య పరిష్కారం కంటే సభను అడ్డుకోవడం, రాజకీయ రచ్చ చేయడమే ముఖ్యం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సభలో చర్చ జరిగితే తాము తీసుకున్న చర్యలను వివరించవచ్చని, కానీ విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రచ్చ చేస్తున్నాయని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. నీట్ సంక్షోభం ఇప్పుడు విద్యావ్యవస్థ సంస్కరణలు , పేపర్ లీకేజీల నిరోధక చట్టాల అమలు దిశగా సాగడం లేదు. జాతీయస్థాయి బలాబలాల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలూ ఆడుతున్న రాజకీయ చదరంగంగా మారింది. ప్రతిపక్షం తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు యువత ఆందోళనను ఇంధనంగా వాడుకుంటుండగా, అధికార పక్షం తన సంఖ్యాబలాన్ని, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిదాడి చేస్తోంది.