కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో అత్యంత ఆదరణ కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ములుగు ఎమ్మెల్యే సీతక్క దృష్టి సారించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు  ఎస్టీ రిజర్వ్‌ స్థానాలు ఉండటం, సీతక్కకు ఇక్కడ పరిచయాలు, బందుగణం ఉండటంతో సీతక్క ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కాస్తా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్‌ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.


తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. అయితే ఇటీవల కాలంలో నాయకులు సరైన దృష్టి సారించకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సైతం అంత చురుగ్గా సాగకపోవడం, ఉన్న కార్యకర్తల మద్య వర్గ పోరు ఉండటంతో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగా తయారైంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో రాహుల్‌ గాంధీ పర్యటన అనంతరం రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది.


ఏజెన్సీలో పట్టున్న సీతక్క..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంతో సీతక్కకు మంచి సంబందాలు కలిగి ఉంది. ఇక్కడ సీతక్క అభిమానులతోపాటు బందుగణం ఉండటంతో ఈ ప్రాంతంలో సీతక్క తరుచూ పర్యటన సాగిస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో సీతక్కకు మంచి కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి ఆదరణ లబిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అవసరమైతే సీతక్క పినపాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందనే ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పొదెం వీరయ్య సీతక్క పర్యటనను వారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పొదెం వీరయ్య ములుగు నియోజకవర్గానికే చెందిన వాడు కావడం, సీతక్కపై పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీతక్క తనకు సమాచారం ఇవ్వకుండానే జిల్లాలో పర్యటన సాగిస్తుందని పీసీసీ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టినట్లు సమాచారం. పొదెం వీరయ్య ప్రస్తుతం సీఎల్‌పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు అనుచరుడిగా ఉండటం, సీతక్క రేవంత్‌రెడ్డి వర్గం కావడంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో భట్టి, రేవంత్‌ వర్గాలుగా కార్యకర్తలు విడిపోయే అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయనే విషయంపై చర్చ సాగుతుంది.


ఖమ్మంలోనూ అదే పరిస్థితి..
ఇటీవల ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొటూరి మానవతారాయ్‌ సీతక్కను సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటన నిర్వహించారు. అయితే ఈ పర్యటనకు జిల్లా బాద్యులుగా ఉన్న భట్టి వర్గం తమకు అంటిముట్టనట్లుగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. జనంలో ఆదరణ ఉన్న నేతగా ఎదిగిన సీతక్క లాంటి నాయకులు జిల్లాలో పర్యటిస్తే ఆ పర్యటనను ఆసరాగా చేసుకుని పార్టీ బలోపేతానికి ఉపయోగించాల్సిన నాయకులు ఇప్పుడు వర్గాలుగా మారిపోవడం కిందస్థాయి కార్యకర్తలకు నచ్చడం లేదు. ఏది ఏమైనా తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు కలిగిన సీతక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించడంతో మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో మంచి పలితాలు వస్తాయనే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.