Modi KCR Meet : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రధాని తెలంగాణకు వచ్చిన సందర్భంలోనూ స్వాగతాలు చెప్పడం లేదు. పైగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఓ కార్యక్రమంలో ఎదురు పడాల్సిన పరిస్థఇతి ఏర్పడింది. ఆ ప్రోగ్రాంకు తాను వస్తానని కేసీఆర్ మాటిచ్చారు. కానీ ఇప్పుడు ప్రధాని కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. మరి కేసీఆర్ వెళ్తారా  ?


చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి రావాలని కేసీఆర్‌కు స్టాలిన్ ఆహ్వానం !


తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కు మంచి గుర్తింపు తసుకురావడం కోసం సీఎం స్టాలిన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పలువురికి ఆహ్వానాలు పంపించారు. ఒలింపియాడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు స్టాలిన్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. ఈ మేరకు డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరిరాజన్ గత శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చి ఆహ్వాన పత్రాన్ని కేసీఆర్ కు అందజేశారు. ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని స్టాలిన్ కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ కూడా తప్పక వస్తానని మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. 


చెస్‌ ఒలింపియాడ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ ! 


అయితే ఈ చెస్ ఒలింపియాడ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.  జులై 28, 29 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జూలై 28న గుజరాత్‌లోని హిమత్‌నగర్‌లో పలు పథకాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.. అదే రోజు గుజరాత్ నుంచి చెన్నై వెళ్లి అక్కడ 44వ చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభిస్తారు.  మోడీ తమిళనాడులో రెండ్రోజుల టూర్ ఖరారు కావడంతో సౌత్ ఇండియా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాని పర్యటన చివరి క్షణంలో ఖరారు కావడంతో...ఇప్పుడు కేసీఆర్ తమిళనాడుకు వెళ్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. 


కేసీఆర్‌కు సంకటమే ! 


ఇటీవల కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కేసీఆర్ పోరాటం తీవ్రతరం చేశారు. నరేంద్ర మోడీ పాలన తీరుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. నేరుగా కలవడం కాదు ప్రధాని నిర్వహిస్తున్న   వీడియో కాన్ఫరెన్స్ కు సైతం కేసీఆర్ దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం అటు కేంద్రానిది కానీ.. ఇటు తెలంగాణది కానీ కాదు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశం. స్టాలిన్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వెళ్లకపోతే స్టాలిన్ ఫీలవుతారు.. వెళ్లే మోదీకి ఎదురు పడాల్సి ఉంటుంది. కేసీఆర్‌కు ఇది క్లిష్టమైన టాపిక్కే !