' ఇండియా' కూటమి తరహా రాజకీయా అవగాహనతో ముందుకు వెళ్తామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని ఆయన వెల్లడించారు. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని అదికూడా రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు. 


పొత్తుల అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతో సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేయాలనేది నా ఉద్దేశమని చెప్పారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... " ప్రస్తుతం కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అన్నది ప్రచారం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదన మాకు రాలేదు. జాతీయస్థాయిలో 'కూటమిలో' కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తాం. పొత్తుల సీట్ల అంశం మీద తొందర లేదు. నామినేషన్లు వేసే వరకు సమయం ఉంది. సీట్లపై చర్చలు కొనసాగుతున్నాయి" అని నారాయణ వెల్లడించారు. 


మోదీ, అమిత్ షా ఎందుకు వస్తున్నారు...
2018 ఎన్నికల్లో బీజేపీ ఓటు బీఆర్ఎస్ కు బదిలీ అయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అందుకే 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ సాయంతో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. బీజేపీ సీనియర్ నాయకుడు వాజ్ పేయిని కూడా రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ కి ఏం ఉందని ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలు వస్తున్నారని నిలదీశారు.


బీజేపీ, బీఅర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణకు పట్టిన పీడ నుంచి విముక్తి లభించబోతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ను ఇంటికి పంపి ప్రజలు సంబరాలు చేసుకోవాలని చెప్పారు. 


ఎన్నికల కోసమే మహిళ బిల్లు
ఎన్నికల కోసమే కేంద్రం మహిళ బిల్లు ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. బీజేపీ కి చిత్తశుద్ది ఉంటే 2024 మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కొనసాగితే దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోవడం ఖాయం అన్నారు.


మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామన్నారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి ఇంకా ముందే తెగ దెంపులు చేసుకోవాల్సిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ కలిస్తే సీఎం కేసీఆర్ కు డిపాజిట్లు కూడా రావన్నారు. 


కర్ణాటకలో బీజేపీ ఓటమి ప్రధాని మోదీ ఓటమి చెంప పెట్టులాంటిదని అన్నారు. ఎన్నికల ప్రచారాలు ఎన్నో చూసాం. కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు కర్ణాటకలో సుదీర్ఘకాలం అక్కడే ఉండి కులాలను మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసాల ద్వారా ఓట్లు సంపాదించాలని ప్రయత్నించారని, కానీ అక్కడి ప్రజలు తిరస్కరించారని చెప్పారు. లౌకిక వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధాని మోదీ ఓట్ల కోసం కక్కుర్తి పడి చివరికి బజరంగ్ జిందాబాద్ అనే స్థాయికి వెళ్లడం ఆయన నైతికతకు నిదర్శనం అన్నారు.