BRS Plan :   భారత రాష్ట్ర సమితిలో  కేటీఆర్ , కవితలు ఎన్నికల బాధ్యతల్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ప్రతీ రోజు అత్యధిక సమయం పార్టీ కోసం కేటాయిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచార సభల్లో పాల్గొనడం, అసంతృప్తి ఉన్న నేతల్ని  బుజ్జగించడం, పార్టీలో చేరికల్ని ప్రోత్సహించడమే కాదు ఇతర పార్టీల నేతలకు చురుకుగా కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ వర్క్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. నియోజకవర్గాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు కానీ.. మిగతా మొత్తం కేటీఆర్, కవితలే విస్తృతంగా పర్యటిస్తున్నారు. 


కేసీఆర్ విస్తృత ప్రచారం సభలకే పరిమిం !


అభ్యర్థుల్ని ప్రకటించిన  తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపుగా నెల రోజుల పాటు బయటకు రాలేదు కొద్ది  రోజులు వైరల్ ఫీవర్ .. ఆ తర్వాత చెస్ట్ ఇన్ ఫెక్షన్ వల్ల రాలేదని కేటీఆర్ మీడియాకు చెప్పారు.  అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత  ఒక్క సారిగా యాక్టివ్ అయ్యారు. అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడంతో పాటు.. వరుసగా నాలుగురోజుల బాటు రోజుకు రెండు చొప్పున బహిరంగసభల్లో పాల్గొన్నారు. మళ్లీ దసరా పండుగ తర్వాత ప్రారంభిస్తారు. రోజుకు రెండు, మూడు సభల్లో ప్రసంగిస్తారు. అయితే కేసీఆర్ ప్రచారం కన్నా ఎక్కువగా తెర వెనుక పనులు చక్కబెట్టాడనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ నేతలు గీత  దాటకుండా చూసుకుంటున్నారు. అవసరమైన వారితో మాట్లాడుతున్నారు. 


క్షేత్ర స్థాయిలో కేటీఆర్, కవితల నాయకత్వం !


పార్టీ వ్యవహారాలకు సంబంధించి కేసీఆర్ అత్యున్నత అంశాలను మాత్రమే  పట్టించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల్ని యాక్టివ్ చేసి.. గ్రామ స్థాయికి ప్రచారం వెళ్లేలా చేసే బాధ్యతను కేటీఆర్,కవితలకు అప్పగించారు. ప్రత్యేకంగా వారికి కొన్ని ప్రాంతాలను కూడా కేటాయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ రాక ముందు నుంచే కేటీఆర్, కవిత తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రచార కార్యక్రమాలు, చేరికలను సమన్వయపరుస్తున్నారు. పార్టీలో ఉండే అంతర్గత అసంతృప్తులను కూడా బుజ్జగిస్తున్నారు. 


జాతీయ నేతలకు ఘాటు కౌంటర్లు !


బీఆర్ఎస్ కు రెండు ప్రత్యర్థి పార్టీలు జాతీయ పార్టీలే .దీంతో జాతీయ నేతలు తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారు. ఓ వైపు  ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు బీజేపీ ముఖ్య నేతలు.. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారానికి వస్తున్నారు. వారు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వారి విమర్శలపై స్పందించడం లేదు. బహిరంగసభల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని అంటున్నారు కానీ రాహుల్ లేదా మోదీ తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వలేదు. అలాంటి బాధ్యతల్ని  కేటీఆర్, కవిత తీసుకున్నారు. మోదీ కి కూడా కేటీఆర్ ఘాటు కౌంటర్ లు ఇచ్చారు. రాహుల్, ప్రియాంకా గాంధీల విమర్శలకూ .. కేటీఆర్ , కవిత గట్టి సమాధానాలు ఇచ్చారు.  జాతీయ నేతల విమర్శలకు..జాతీయ స్థాయిలో  ప్రచారం ఇచ్చేలా రివర్స్ కౌంటర్ ఇవ్వడంలో కేటీఆర్, కవిత సక్సెస్ అవుతున్నారు. 


వ్యహాత్మకంగానే ఎన్నికల బాధ్యతలు కేటీఆర్, కవితలకు అప్పగిస్తున్నారా ?


ప్రతీ సారి ఎన్నికలు అంటే... కేసీఆర్ ఎక్కువగా కనిపించేవారు. కానీ ఈ సారి మాత్రం కేటీఆర్, కవిత మాత్రమే హైలెట్ అవుతున్నారు. కేసీఆర్ బహిరగంగా ప్రచార సభలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. జాతీయ పార్టీలకు కౌంటర్ ివ్వడం సహా.. విమర్శలు, ప్రతి విమర్శలన్నింటికీ .. కేటీఆర్, కవితలకే బాధ్యతలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత  కీలక పరిణామాలు  జరుగుతాయని.. అందులో భాగంగానే వీరిద్దరికీ కేసీఆర్ ప్రయారిటీ ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.