Telangana Politics :  తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలని ఫైనల్‌గా నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయితే మళ్లీ కేసీఆర్ మనసు మార్చుకున్నారని.. కమ్యూనిస్టులతో పొత్తులకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. 


ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు లేని స్పష్టత 


కేసీఆర్  పొత్తుపై ఇప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలకు ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు.  మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రం ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్య అధినేత కేసీఆర్‌ నుంచి పిలుపును అందుకున్నారని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందడం వెనుక సీపీఐ, సీపీఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సైతం తన ఓటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారు. అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పని చేస్తామని..  అంతే కాదు దేశంలో కూడా కలిసి పనిచేస్తామన్నారు.  కానీ ఇప్పుడు చాలా సార్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినా వారికి అధినేత ఇవ్వలేదని సమాచారం. పొత్తులపై ఏదో ఒక్కటి తేల్చండి.. మా దారి మేము చూసుకుంటామని గత నెల నుంచి సీపీఐ, సీపీఎం నేతలు బహిరంగంగానే స్వరం పెంచారు. ఇప్పటికి వారికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.


దక్షిణ తెలంగాణలో గట్టి పోటీ - కమ్యూనిస్టులు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం  


దక్షిణ తెలంగాణను దృష్టిలో పెట్టుకొని అధినేత కేసీఆర్‌ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పొట్టుకోవచ్చా లేదా అన్న సమాలోచనలు చేస్తున్నారు.  సీపీఐ, సీపీఎం పార్టీలకు నమ్మకమైన ఓటు  బ్యాంక్ ఉంటుంది.  ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధినేత అంచనా వేస్తున్నారు. ఈ సారి కూడా కనీసం మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్నారు.  ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయారు. క్కడ తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని నమ్ముతున్నారు. 


కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండేందుకైనా పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన !


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాండిస్తే కమ్యూనిస్టులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే వెళ్తారు. జాతీయ స్థాయిలో వారు కూటమిలో భాగంగా ఉన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్‌కు మేలు చేస్తాయి. ఇది బీఆర్ఎస్ చీఫ్‌కు ఇష్టం లేదు. అందుకే వారిని వదులుకోవడం ఎందుకన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.  పొత్తులో భాగంగా చెరి మూడు స్థానాలను సీపీఐ, సీపీఎం కోరుతున్నాయి. కమ్యూనిస్టులు కోరుతున్న అన్ని స్థానాల్లోనూ గులాబీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.  పొత్తు పెట్టుకుంటే బీఆర్‌ఎస్‌కు ఎంత శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఏఏ స్థానాల్లో వారితో పొత్తు కలిసి రానుంది. అని  కేసీఆర్ లాభ నష్టాల అంచనాల్లో ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా వారంలో పొత్తులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.